ఢిల్లీ: తనపై జరిగిన దాడి వెనక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ హస్తం ఉందని వైయస్ఆర్ సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. తనపై జరిగిన దాడిపై వెంటనే విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయాలి డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తనపై దాడులు జరిగితే బాబు, లోకేష్లే కారణమన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడితే.. లోకేష్ ఈ జన్మకు ఎమ్మెల్యే కాలేడన్నారు. పింఛన్ డోర్ డెలవరీ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి టీడీపీ నేతలు ఇలాంటి దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఎంపీ నందిగాం సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది.. ప్రజలకు సమాన ఫలాలు అందుతాయన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు.
శివరామకృష్ణ కమిటీ అమరావతిని రాజధాని వద్దని చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదన్నారు. టీడీపీ నేతలు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చి రైతుల భూములను బెదిరించి లాక్కున్నారన్నారు. రాజధాని ప్రాంతంలోని నిజమైన రైతులకు నష్టం జరగదని, రైతులు, దళితులను చంద్రబాబు భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బెదిరింపులకు లొంగేదిలేదని, దళితులు బాగు పడితే చంద్రబాబు ఓర్వలేడని, దీనిలో భాగంగానే తనపై దాడి చేయించాడన్నారు. రైతులతో చర్చలు జరపడానికి ఎంపీ కృష్ణ దేవరాయలును సీఎం వైయస్ జగన్ అమరావతికి పంపించారని, రైతులతో ప్రభుత్వం చర్చలు జరపకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. అమరావతి రైతుల బాధకు చంద్రబాబు నాయుడే కారణమని, తన సొంత ఆస్తుల ధరలు పెరగాలని చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నాడన్నారు. దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మేం మాటలతోనే సమాధానం చెప్పాం.. చేతల్లో చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.