రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే సీఎం ధ్యేయం

మూడు రాజధానులకే ప్రజలంతా మొగ్గుచూపుతున్నారు

చంద్రబాబు చేసేది కృత్రిమ ఉద్యమమని జనం గమనించారు

సీఎం నిర్ణయానికి మద్దతుగా బీసీ విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు

జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు..

పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

 
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ధ్యేయమని, ప్రభుత్వం అందించే ప్రతి ఫలం పేదవర్గాలకు చెందాలనే ఆలోచనతో చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ అవసరమన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నామని ఎక్కడా చెప్పలేదని, శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందన్నారు. చంద్రబాబు తన రియలెస్టేట్‌ వ్యాపారం కోసం ప్రజలను గందరగోళ పరిస్థితులకు నెట్టేందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాడని జంగా మండిపడ్డారు. కృత్రియ ఉద్యమం చేస్తున్నాడన్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా బీసీ విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని జంగా కృష్ణమూర్తి చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి జిల్లా హెడ్‌క్వార్టర్‌లో బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, మేధావులతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 25 పార్లమెంట్‌ జిల్లాలకు సంబంధించి ప్రతి పార్లమెంట్‌ హెడ్‌క్వార్టర్‌లో సమావేశం, సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బీసీ నాయకులంతా పాల్గొనాలని జంగా విజ్ఞప్తి చేశారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాజధాని నిర్మాణం గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన తరువాత మనం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విభజన సమయంలో మన వాటాగా ఇచ్చిన రూ.94 వేల కోట్ల అప్పును రూ.3 లక్షల కోట్లకు పెంచాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం పేరుతో రైతులను బెదిరించి, భయపెట్టి దాదాపు 53 వేల ఎకరాల భూమిని సేకరించాడు. ఎందుకు ఇంత భూమిని ఆక్రమించావు. ఏ ప్రాంత అభివృద్ధి కోసం ఆక్రమించావనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. 53 వేల ఎకరాల భూమి తీసుకొని అమరావతిని ఒక భ్రమరావతిగా మార్చి గ్రాఫిక్స్‌ చూపించాడు. గ్రాఫిక్స్‌ కోసం వేల కోట్లను దుర్వినియోగం చేశాడు.  

5 సంవత్సరాల కాలంలో అమరావతిలో రాజధాని నిర్మాణానికి చంద్రబాబు సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ. లక్షా 9 వేల కోట్లు అవసరం అని చంద్రబాబే చెప్పాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని చెబుతూనే రూ. లక్షా 9 వేల కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు తయారు చేశాడు. ప్రతి ఐదు సంవత్సరాలుకు రూ. 5 వేల కోట్లను అమరావతిలో ఖర్చు చేసుకుంటూ పోతే   నిర్మాణం పూర్తయ్యే సరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చంద్రబాబు ఆలోచించారా..? అమరావతిని రియలెస్టేట్‌ వ్యాపారంగా చంద్రబాబు మార్చుకున్నాడు.

సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు హర్షిస్తున్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రజలు భావిస్తున్నారు. రాయలసీమలో కనీసం తాగడానికి నీరు లేవు.. కోస్తా ప్రాంతం రాష్ట్రానికి అన్నం పెట్టే ప్రాంతం. ఉత్తరాంధ్రలో సముద్ర తీర ప్రాంతం ఉంది. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకొని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ చూస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులు వేస్తూనే.. బడుగు, బలహీనవర్గాలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పెన్షన్, రైతు భరోసా, వాహనమిత్ర ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు.

గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి పరిపాలనను గుమ్మం ముందుకే తీసుకువచ్చారు. ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పరిపాలన చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు. రాజధాని రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని జంగా కృష్ణమూర్తి చెప్పారు.

Back to Top