తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ అందిస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాయని, ప్రజలంతా వైయస్ఆర్ సీపీకే ఓటు వేయాలనే అభిప్రాయంతో ఉన్నారన్నారు. తిరుపతి నగరంలో లోక్సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైయస్ఆర్ సీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలన్నీ తమకు అందుతున్నాయని, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ ప్రతిష్టాత్మకమైన నాయకుడు అని ఉప ఎన్నిక ద్వారా దేశానికి తెలియచెబుతామని ప్రజలే అంటున్నారన్నారు. పబ్లిసిటీ, మేనేజ్మెంట్ను మాత్రమే నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే భూమన అన్నారు. ప్రచార రథాలు, ప్రసార మాధ్యమాలు తప్ప ప్రజలను ఎప్పుడూ చంద్రబాబు నమ్ముకోలేదన్నారు. ప్రజల దగ్గర వెళ్లి టీడీపీకి ఓటు వేయండి అని చెప్పే ధైర్యం బాబుకు లేదన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు తరిమికొట్టే ప్రమాదం ఉందని గ్రహించి.. ఏ ఇంటికి వెళ్లకుండా ప్రెస్మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే భూమన మండిపడ్డారు.