తాడేపల్లి: రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్టు తీసుకుని రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ను చంద్రబాబు పక్కనపెట్టాడో ప్రజలకు స్పష్టం చేయాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టుపెట్టడం అలవాటుగా మార్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా హక్కులు వదిలేసుకుని చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చాడని.. ఇప్పుడు ఆ కేసు నుంచి బయటపడటం కోసం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడని విమర్శంచారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్టును తానే ఆపేయించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. దానిపై నిజనిర్ధారణకు కూడా సిద్ధమని ప్రకటించడం చూస్తే ఎన్నో అనుమానాలకు తావిస్తోందని వివరించారు. ఏపీ ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ రహస్య ఒప్పందం ఏమిటో చంద్రబాబు ఏపీ ప్రజల ముందు బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ కి మంచి పేరు రావడం ఓర్వలేకనే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును పణంగా పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించినందుకే తనపై అక్రమంగా కేసు నమోదు చేసి, వారెంట్ జారీ చేశారని పేర్కొన్నారు. చిన్నారిని చంపేసి ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు మృతదేహాన్ని గుర్తించి నిందితులను శిక్షించలేని కూటమి ప్రభుత్వం.. అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైయస్ఆర్సీపీ నాయకులపై మాత్రం అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని గోరంట్ల మాధవ్ సూచించారు.