అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు జగనన్న ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. నార్పల మండల కేంద్రంలోని సుల్తాన్ పేటలో "చేయుత మహిళా మార్ట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో మొట్టమొదటి ‘చేయూత మహిళా మార్ట్ ’ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతపురం జిల్లాలో మొట్టమొదటగా మన శింగనమల నియోజకవర్గంలో ఏర్పాటుచేశారని, అందుకు జగనన్నకు కృతజ్ఞతలు అని తెలిపారు. చేయూత మహిళా మార్ట్ ని మహిళలే స్వయంగా నడుపుతారని అన్నారు. ఇక్కడ నాణ్యమైన సరకు అందించేందుకు అన్నివిధాల చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. చేయూత మహిళా మార్ట్ లను త్వరలో అన్నిచోట్లా ఏర్పాటు చేసేందుకు జగనన్న చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను జగనన్న అన్వేషిస్తున్నారని, ప్రభుత్వ పరంగా వారికి ఎంతవరకు సహాయసహకారాలు అందించాలో అన్నీ చేస్తున్నారని కొనియాడారు. జగనన్నది మహిళా ప్రభుత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.