గుంటూరు: ప్రజారోగ్యానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారని, వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని సంబంధిత శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించేందుకు దేశంలోనే అత్యుత్తమ వైద్య విధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో త్రీడీ డిజిటల్ మామోగ్రఫీ వైద్య పరికరాన్ని మంత్రి విడుదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదికి 50 వేల నుంచి 60 వేల వరకు కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పూర్తి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ఆస్పత్రులను అత్యాధునిక క్యాన్సర్ కేర్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు వైద్యులు, సిబ్బందికి శిక్షణ, సాంకేతిక సహకారం కోసం విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రభుత్వాస్పత్రుల్లో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి విడుదల రజిని చెప్పారు. కడప, కర్నూలులో రూ.120కోట్లతో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానాన్ని ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. చంద్రబాబుకు మోసం చేయడం మాత్రమే తెలుసునని, వైద్య, ఆరోగ్య రంగానికి ఏమీ చేయని ముఖ్యమంత్రిగా బాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. రూ.కోటి విలువైన ఈ త్రీడీ డిజిటల్ మామోగ్రఫీ వైద్య పరికరాన్ని జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్కు అందించిన అమృతలూరుకు చెందిన గడ్డిపాటి కస్తూరిదేవి, రామ్మోహనరావు, శివరామకృష్ణబాబు, నాట్కో ట్రస్ట్–హైదరాబాద్ వారిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు షేక్ ముస్తఫా, మద్దాలి గిరి, ఉండవల్లి శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.