విజయవాడ: ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయని, కోవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఇంకా మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్ధేశంతోనే రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య రంగం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు కల్పించేందుకు నిత్యం తపిస్తున్నారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు గొప్ప సేవలు అందిస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీలో అందించే చికిత్సలను పెంచామని, 3255 వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చారని, వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు.
గతంలో ఎన్నడూ లేనంతగా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య రంగంలో 49వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తుచేశారు. వైద్యానికి కావాల్సిన బడ్జెట్ పెంచాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. వైయస్ జగన్ మనసున్న ముఖ్యమంత్రి అని చెప్పారు. ముందస్తుగా ఆరోగ్య సమస్యలను గుర్తించడం వల్ల ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. మెడికల్ కాలేజీలు తేవాలంటే చాలా ధైర్యం కావాలని, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి సీఎం వైయస్ జగన్ చరిత్ర సృష్టించారని చెప్పారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నదే సీఎం ఆశయమన్నారు. భావితరాలకు మెరుగైన వైద్యం అందించడం కోసం సీఎం ఒక మహాయజ్ఞం చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఇప్పటికే కొంత మేర చెల్లించాం.. త్వరలోనే మిగతా వాటిని కూడా చెల్లిస్తామని చెప్పారు. నాణ్యమైన వైద్యం అందించే విషయంలో వైయస్ జగన్ ప్రభుత్వం రాజీ పడదని మంత్రి విడదల రజిని అన్నారు.