తాడేపల్లి: మెమోకి, జీవోకి తేడా తెలియని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్... శెట్టిబలిజలకు వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాల కృష్ణ తేల్చి చెప్పారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...జీవో నెంబరు 16 తోపాటు శెట్టి బలిజలకు ఎవరేం చేశారన్న దానిపై కుల పెద్దలు, మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా?అని సవాల్ విసిరితే... మంత్రి ఎందుకు తోక ముడిచారని నిలదీశారు. చంద్రబాబు హయాంలో 1997లోనే జీవో నంబరు 16 విడుదల కాగా... దాన్ని ఏ ప్రభుత్వాలు అమలు చేయలేదని, తిరిగి కూటమి ప్రభుత్వం హయాంలో 2025 జూలై 30 నుంచి శెట్టిబలిజ సర్టిఫికేట్ లో గౌడ అని చేర్చి అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. దాన్ని కప్పిపుచ్చిన మంత్రి.. వైయస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు. వైయస్ఆర్సీపీ హయాంలో ఆ నిర్ణయం తీసుకుంటే తాను క్షమాపణల చెబుతానన్న వేణుగోపాల్, కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినట్లు తేలితే క్షమాపణలు చెప్తారా అని మంత్రిని నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● మంత్రి సుభాష్ చర్చకు సిద్దమా ? కూటమి పాలనలో ముఖ్యమంత్రితో సహా మంత్రులు ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ప్రతి అంశంలోనూ ప్రభుత్వం తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోయి... దాన్ని ప్రతిపక్షం మీద నెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. వాస్తవాల మీద చర్చకు సవాల్ విసిరితే దానికి సమాధానం చెప్పకుండా అధికార పార్టీ నేతలు పలాయనం చిత్తగిస్తున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వనభోజనాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైనా, నా పైన చేసిన ఆరోపణల మీద చర్చకు నేను సిద్ధమని ప్రకటిస్తే... ఆయన పత్రికా ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. ఆ ప్రకటనలో శెట్టిబలిజలను గౌడ కులస్తుల్లో చేరుస్తూ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోని.. చంద్రబాబు పాలనలో చేసిన జీవోగా నేను విమర్శించానని చెప్పారు. మంత్రి సుభాష్ కి కనీస అవగాహన లేదనడానికి ఇంతకు మించి నిదర్శనం లేదు. ఈ సందర్భంగా నేను మీ మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుందో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపమని మీరు చెప్పారా? మీ మంత్రులే పంపిస్తున్నారా? మా ప్రభుత్వంలో జీవో విడుదల చేసి.. అది కూటమి ప్రభుత్వమే విడుదల చేసిందని నేను చెప్పినట్లు ఆరోపిస్తున్న మంత్రులు... దానిపై చర్చకు రమ్మంటే మాత్రం ఎందుకు రావడం లేదు? అసలు జీవో ఎవరు విడుదల చేశారు? 1997 నుంచి 2025 జూలై 30 వరకు ఈ సమస్య రాలేదు? ఇప్పుడు సమస్యకు ఎవరు కారణమన్న దానిపై చర్చకు సిద్ధమా ? అని నేను సవాల్ చేస్తే దానికి బదులివ్వకుండా మంత్రి సుభాష్ మీడియా ద్వారా ప్రశ్నలు సంధిస్తున్నాడు. మరోసాని నేను మంత్రికి స్పష్టం చేస్తున్నాను. మీరు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండండి? అవి నిజమని నిరూపించండి? నేను కచ్చితంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి క్షమాపణ చెబుతాను. నిరూపించలేకపోతే మీరు నాకు, శెట్టిబలిజ జాతికి క్షమాపణ చెప్పాలి. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం నీకు అలవాటు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఎవరిని దూషిస్తున్నావ్ ? శెట్టిబలిజ సామాజిక వర్గాన్నే దూషిస్తున్నావ్. ● శెట్టిబలిజలను తాకట్టు పెడుతున్న మంత్రి సుభాష్... ఏ జీవో ఎప్పుడు వచ్చింది? మెమో ఎప్పుడు వచ్చిందో కూడా మాట్లాడదాం. శెట్టి బలిజ యువతకు నేను కోరేదొక్కటే. 2025 జూలై నెల వరకు శెట్టిబలిజ సామాజికధృవీకరణ పత్రాల్లో ఎక్కడైనా గౌడ అని ముందు ఉందా? గౌడ (శెట్టిబలిజ) అని ఉందా? లేదు కదా? మరి వైయస్ఆర్సీపీలో మెమో ఇచ్చారు అంటున్న మంత్రి... ఇప్పుడు మీ ప్రభుత్వంలో దాన్ని అమలు చేస్తున్నావా? నీ రాజకీయ పబ్బం కోసం మెమో ఇచ్చారని చెబుతున్నావు. మెమో అధికారులు అంతర్గత సర్దుబాట్లు కోసం ఇచ్చారు. కానీ జీవో ఎక్కడా అమలు కాలేదు. నేను గౌడ బ్రాకెట్లో శెట్టిబలిజ జీవో ఇచ్చానని చెబుతున్నాడు. జీవో నెంబరు 16 చదివితే చంద్రబాబు హయాంలోనే జారీ అయింది. కులాల మధ్య చిచ్చు పెట్టారు. కులాలు కలవాలన్న స్వాతంత్ర్య సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న గారి ఆశయాన్ని మీరు పొడిచి హత్య చేశారు. ఆయన ఆశయాలను తుంగలో తొక్కి మరుసటి రోజు ఆయన జయంతి ఉత్సవాలు చేశారు.శెట్టిబలిజ అని నామకరణం చేసిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు నిర్ణయాన్ని అందరం స్వాగతించాం. ఇవాళ శెట్టిబలిజకు ముందు గౌడ అని చేర్చి.. బ్రాకెట్లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన చేర్చిన సందర్భంలో దాన్ని అడ్డుకుని కోర్టులో వేసింది కుడిపూడి సూర్యనారాయణరావు. అప్పటి నుంచి అది అమలు కాలేదు. కానీ నువ్వు మాత్రం హైదారబాద్ వెళ్లి మీడియాతో జీవో 16 ని అమలు చేస్తామని చెప్పావు. ఫలితమే ఏపీలో జూలై 30 నుంచి గౌడ బ్రాకెట్ లో శెట్టిబలిజ, శ్రీశయన, ఈడిగ అని పదాలు చేర్చడం మొదలుపెట్టారు. దీంతో మరలా అమలాపురంలో అసంతృప్తి నెలకొంది. దీనికి కారణం మీరే. మీరు మంత్రి అయి హైదరాబాద్ లో శెట్టిబలిజ సమావేశం పెట్టి అందులో జీవో 16 అమలు చేయడం మా హక్కు అని చెప్పిన మీ వల్లే సమస్య వచ్చింది. శెట్టిబలిజల్లో వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు వంటివారు ఉన్నారు. మీ సమక్షంలో మంత్రి సుభాష్ ని అడుగుతున్నాను. చర్చకు రండి. ఎవరు జీవో విడుదల చేశారో తేలిపోతుంది. శెట్టి బలిజ కులానికి ఎవరేం చేశారో అన్ని విషయాలు తేలుద్దాం. మీడియాను న్యాయనిర్ణేతులుగా పెట్టి చర్చిద్దాం. సంఘపెట్టల దగ్గర పెడదాం. నువ్వు మాత్రం నిన్ను ఆదుకున్న కులాన్ని మోసం చేసి.. తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేయవద్దు. ఎవరు కులాన్ని తాకట్టు పెడుతున్నారో అది కూడా చర్చిద్దాం. చనిపోయిన చిట్టబ్బాయి.. శెట్టిబలిజ కులం కోసం హారతి కర్పూరంలా ఆరిపోయాడు. నీలాంటి వెన్నుపోటు దార్లు వల్ల నష్టపోతే.. ఆ కుటుంబాన్ని ఎవరూ ఊహించనంత గొప్పగా వైయస్.జగన్ ఆదుకున్నారు. అందుకు నేను వైయస్.జగన్ కి కృతజ్ఞత చెబితే... నేనేదో సాష్టాంగ పడ్డానని కారుకూతలు కూస్తున్నావు. అసలు మూడేళ్ల నుంచి నువ్వు ఎంత మంది కాళ్లమీద పడ్డావో అందరికీ తెలుసు. నేను పదే పదే నా నోటితో చెప్పలేను. చెల్లుబోయిన వేణుగోపాల్ ను సోషల్ మీడియాతో ట్రోల్ చేయిస్తే.. చంద్రబాబో, లోకేషో అక్కున చేర్చుకుంటారని భావిస్తున్నావు. ఆయన చేర్చుకున్నాడా? అసలు నీ మీద కేసులు ఎత్తివేయించిందే నేను, దానిమీద కూడా చర్చిద్దాం. ● మరోసారి సవాల్ చేస్తున్నా, బహిరంగ చర్చకు రా? ఇంతవరకు ఓపిక పట్టాను. ఇక సహించేది లేదు. రామచంద్రాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజలకు ఎవరేం మేలు చేశారో బహిరంగంగా చర్చిద్దాం. జీవోకి, మెమోకి తేడా తెలియని మంత్రులను కేబినెట్ లో పెట్టుకుంటే ఇంతకంటే ఏం ఆశించలేమని మంత్రి వేణుగోపాల్ స్పష్టం చేశారు. చర్చకు రమ్మంటే పలాయనం చిత్తగించి, తోక ముడిచి పారిపోయిన మంత్రి మరోసారి సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడితే.. చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.