విజయవాడ: హెల్త్ యూనివర్సిటీకి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సముచితం అని మత్య్స శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైయస్ఆర్ పరిపాలనకు ముందు.. ఆ తరువాత వైద్య రంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య శాఖలో సంస్కరణల్లో క్రిస్టల్ క్లియర్ డిఫరెన్స్ ఉందన్నారు. వైయస్ఆర్ సువర్ణ పాలనకు గుర్తుగా, ఆయన ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా హెల్త్ యూనివర్సిటీకి వైయస్ఆర్ పేరు పెట్టామన్నారు. విజయవాడలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రంలో లక్షలాది మంది గుండెలు ఆగిపోకుండా ఉన్నాయంటే అందుకు కారణం వైయస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కారణమన్నారు. వేలాది మంది నిరుపేద విద్యార్థులు వైద్య విద్య పూర్తిచేసుకుంటున్నారంటే దానికి వైయస్ఆర్ చేసిన సేవే కారణం.. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. అన్ని బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో ప్రజల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేసిన చరిత్ర చంద్రబాబుది అని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్పత్రులను రూపురేఖలు మార్చి నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందజేయాలనే ఆలోచన చంద్రబాబు ఎప్పుడైనా చేశారా..; అని ప్రశ్నించారు. వెన్నుపోటును ప్రజలంతా మరిచిపోవాలని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాడని, చిత్రహింసలు, క్షోభకు గురిచేసి ఎన్టీఆర్ను మానసికంగా హత్య చేసిన చరిత్ర చంద్రబాబుది అని గుర్తుచేశారు. దాని నుంచి బయటపడాలని విరుగుడుగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాడని, అందుకు చంద్రబాబు ఎంత బాధ పడి ఉంటాడో ఆయన మాటల్లోనే అర్థం అవుతుందన్నారు.