తాడేపల్లి: బ్లాక్లో టికెట్లు అమ్మితే ప్రభుత్వం పట్టించుకోవద్దా అని మంత్రి పేర్ని నాని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. బ్లాక్ టికెట్ వ్యవస్థను నిర్మూలించడం తప్పా అని నిలదీశారు. ఓ సినిమా కోసం తండ్రీ, కొడుకులు పిల్లి మొగ్గలు వేయడం సిగ్గు చేటు అన్నారు. సినిమాను కూడా చంద్రబాబు రాజకీయం కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో సినిమా టికెట్ ధరలపై జారీ కావాల్సిన జీవో ఆలస్యమైందన్నారు. పవన్ కల్యాణ్ తన సినిమాను ఫ్రీగా చూపిస్తామన్నారు కదా? ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం మంత్ర పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓ సినిమా రిలీజ్ కోసం తండ్రీ, కొడుకులు ఇద్దరు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ జీవితంలో రాజకీయానికి వాడుకోవడానికి పనికి రాని వస్తువు ఏది లేదనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కుతున్నామని ఆరోపిస్తున్నారు. ఈ తొక్కటం ఏంటో అర్థం కావడం లేదు. ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి, హరికృష్ణ కుటుంబాలను తొక్కేయడం అంటారు. సినిమా తీసుకుంటున్నారు. రిలీజ్ చేసుకుంటున్నారు. చట్టం మాకు పనికిరాదు. మేం చట్టానికి అతీతులమని ప్రవర్తించండి అని మీరు చెబుతున్నారా?. ప్రభుత్వం నిర్దేశించిన రేటుకు కాకుండా మా ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటామని ఎవరైనా ప్రవర్తిస్తే ^è ట్టం కంట్రోల్ చేస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం కాదుకదా? ఏపీలోని అన్ని వ్యవస్థలను గాడి తప్పేలా చేశారు. రాజకీయాల కోసం ప్రతి వ్యవస్థను దిగజార్చారు. చంద్రబాబు పాడు చేసిన, అస్తవ్యస్తంగా చేసిన ప్రతి వ్యవస్థను ఇవాళ వైయస్ జగన్ గాడిలో పెడుతున్నారు. ఈ రకమైన దిగజారుడు మాటలు మాట్లాడటం బాధాకరం.జీవో 35 ప్రకారం ఆయా కేటగిరిల్లోని థియేటర్లకు రేట్లు ఫిక్స్ చేశాం. ఆ రేట్ల ప్రకారమే టికెట్లు విక్రయించాలి. కొంత మంది ఎగ్జిబ్యూటర్లు హైకోర్టులో ఈ జీవోపై చాలెంజ్ చేశారు. ప్రతి సినిమాకు థియేటర్ యాజమాన్యం జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి రేట్లు ఫిక్స్ చేసుకొని సినిమా ఆడించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు అన్నా, ప్రభుత్వం అన్నా, జీవోలు అన్నా వీరికి లెక్క లేదు. వ్యవస్థ అంటే అసలు లెక్కే లేదు. ఈ వ్యవస్థ చెడిపోవడానికి చంద్రబాబు కదా?. మైక్ పట్టుకుంటే చాలు రోజు నీతులు చెప్పే పవన్ కల్యాణ్.. నీతిమాలిన పనులు చేస్తున్నారు. ఇవి పనికి మాలిన పనులు కాదా?. బ్లాక్ మార్కెటింగ్ను కూడా ఒక రాజకీయ పార్టీ ప్రోత్సహించడం, భజన చేయడం ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కనిపిస్తున్నాయి. బ్లాక్లో టికెట్లు అమ్ముతుంటే తప్పుగా చూపించాల్సిన టీవీ చానల్స్ కూడా దుర్మార్గంగా, కిరాతకంగా చిత్రీకరించడం, ప్రజలకు తప్పుడు సమాచారం అందించడం సరికాదు. భగవంతుడు వీరిని ఎలా ఉపేక్షిస్తున్నాడో అర్థం కావడం లేదు. రాజకీయ వ్యవస్థ కాని, టీవీలు కాని, పేపర్లు కానీ బ్లాక్లో టికెట్లు అమ్మడం తప్పు అని చెప్పాలి. దాన్ని వదిలి..వైయస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత కిరాతకానికైనా ఒడిగట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. ఇవాళ ప్రభుత్వం నిర్దేశించిన జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేసిన కోర్టు..జాయింట్ కలెక్టర్ వద్ద అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా అధికారులు కదా టికెట్ రేట్లు ఫిక్స్ చేసేది. మేం ఎవరికి దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వం మా వద్దకు రాకూడదని, అంతా మా ఇష్టారాజ్యం అంటే ఎలా? వ్యవస్థను ఏం చేద్దామని? చిరంజీవి, ప్రభాస్, మహేష్బాబు వస్తే జీవో ఇస్తామన్న ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. ఎంత కిరాతకంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఉచ్చం, నీచం లేనటువంటి పరిస్థితి. 21వ తేదీన కమిటీ కూర్చొని రేట్లు ఫైనల్ చేయాల్సి ఉంది. 22వ తేదీన సినిమాటోగ్రఫి హోం సెక్రటరీ ఓ డ్రాప్ట్ తయారు చేసి లా డిపార్టుమెంట్కు పంపించి, దానికి స్క్రూట్నీ చేసుకొని 24వ తేదీన జీవో ఇవ్వాల్సి ఉంది. ఇది నేపథ్యమైతే..ఈ ప్రభుత్వంలో బాధ్యత గల ఒక యువ మంత్రి గౌతమ్ రెడ్డిని కోల్పోయిన ఆందోళనలో మేమంతా ఉంటే..ఇవాళ జీవో రాలేదని రాజకీయం చేస్తున్నారు. సొంత బావ మరది శవం పక్కన కూర్చొని పొత్తుల గురించిమాట్లాడిన నీచ మనస్తత్వం ఎవరిది? మిత్రుడు గౌతమ్ రెడ్డి చనిపోతే హైదరాబాద్కు సీఎం వైయస్ జగన్ పరుగెత్తుకెళ్లారు. రెండో రోజు అంత్యక్రియలకు వెళ్లాడు. చంద్రబాబు కూడా గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి దండేసి, మరుసటి రోజే ఇక్కడికి వచ్చి తన మనుషులతో నీచంగా మాట్లాడించారు. ఆయన మరణం గురించి అవాకులు, చవాకులు పేలుతున్నారు. వీరిని ఏమనాలి?. వేధవలు, సంస్కార హీనులు అనాలా?. మనిషి మరణిస్తే..ఆ బాధ, లోటు చంద్రబాబు లాంటి వ్యక్తులకు ఆ విలువ తెలియదు. ఎవరు చనిపోయిన వారి శవంతో రాజకీయం చేసుకుంటారు. ఈ ప్రభుత్వం బాధ్యతాయుతమైన మంత్రిని కోల్పోయిన ఆవేదనతో ఉంటే..జీవో ఎలా ఇవ్వాలి?. గౌతమ్ రెడ్డి మరణించారని పవన్ ఆడియో ఫంక్షన్ ఒక రోజుకు వాయిదా వేసుకున్నారు. సినిమా రిలీజ్ను మరో రోజుకు వాయిదా వేసుకోలేడా?. ఇవాళ ఉన్న రేట్ల ప్రకారమే కదా సినిమా ప్రదర్శించాలి. పగలదీస్తాం అన్నారు ..సినిమా ఫ్రీగా చూపిస్తామన్నారు కదా?. బ్లాక్లో అమ్ముకునే బతుకెందుకు. ఫ్రీగా చూపించవచ్చు కదా?. ఒక వైపు ఆయన ఇలా ప్రవర్తిస్తుంటే..మరో వైపు తండ్రి కొడుకులు సినిమా రిలీజ్ కాకుండానే రాజకీయాలు మాట్లాడుతున్నారు. లోకేష్ బాబు సినిమా చాలా బాగుందని, ఎప్పుడెప్పుడు చూడాలనే తహతహలాడుతున్నానని అంటాడు. ఎంత ప్రేమ నీది. కపట ప్రేమ. టీడీపీ జెండా మోసిన జూనియర్ ఎన్టీఆర్ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? సినిమా చూడాలని ఒక్క రోజైనా మీ తండ్రి కొడుకులు తహతహలాడారా? జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూస్తానని ఒక్క రోజైనా మాట్లాడారా?. కుప్పంలో వన్ సైడ్ లవ్ ఉండదన్నారు. ఇది ఏ సైడ్ లవ్ చెప్పాలి. ఇది అఫ్ సైడా? ఏంటి ఈ ప్రేమ? ఎందుకు ఇంతలా ప్రేమ ఒలగపోస్తున్నారు. పవన్ సినిమాను ఎప్పుడైనా పట్టించుకున్నామా? నైతికంగా, చట్టబద్ధంగా వాస్తవంలో జీవించలేని వ్యక్తులు ఈ సమాజంలో నీతులు చెప్పడానికి ఎందుకు పనికి వస్తారు. ఎలా పనికి వస్తారు. నైతిక విలువలు లేవు. చట్టబద్ధంగా బతికే బాధ్యత లేదు. చట్టాన్ని గౌరవించే పెద్ద మనసు లేదు. చెప్పేది శ్రీరంగ నీతులు..చేసేవి వేరు. లోకేష్ను చంద్రబాబు మనవడు ..నాన్నా రోజు ఇంట్లో ఉంటున్నావు..రోడ్ల వెంట తిరగమని దేవాన్స్ చెబుతున్నాడట? ఏం కర్మ ఇది. నీకు వచ్చిన కర్మ చూసి జాలేస్తుంది. చంద్రబాబేమో నా కొడుకు పనికి రాడని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు మనవడు కూడా మా నాన్న పనికిరాకుండా పోతున్నాడని, నాన్న బయటకు వెళ్లమని చెబుతున్నాడట. పుష్ప, మహేష్ సినిమాలు, బహుబలి సినిమాలు జనం చూడటం లేదా? చిరంజీవి మేనల్లుడు సినిమా తీస్తే జనం ఎగబడి చూడలేదా? ముగ్గురు కు్రరాళ్లు సినిమా తీస్తే జనం చూడలేదా? బాగుంటే ఎవరి సినిమా అయినా చూస్తారు. గబ్బర్ సింగ్, అజ్ఞాత వాసిని జనం చూడలేదు. ప్రతిదీ రాజకీయానికి వాడుకోవడం సరికాదు. ఇలా దిగజారిన రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరొక్కసారి చంద్రబాబును ప్రశ్నిస్తున్నా..నిజంగా మీరు గతంలో ప్రభుత్వాన్ని నడిపారా? మరేమైనా నడిపారా? చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని చెప్పారా? ఇంతలా దిగజారాలా? నిఖారైన, దమ్మున్న మంత్రి అకాల మరణం కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన జీవో ఆలస్యమైంది. సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మించాలని డిమాండు చేయడం దురదృష్టకరం. మహేష్, ప్రభాస్, చిరంజీవి సినిమా చూడాలని ఎప్పుడైనా ట్వీట్ చేశారా? చంద్రబాబు, లోకేష్ పరిస్థితి జుగుప్సాకరంగా ఉంది. చంద్రబాబు లాంటి సిగ్గుమాలిన నేతతో రాజకీయాలు చేయాల్సి రావడం మేము కూడా సిగ్గు పడుతున్నాం. మా దురదృష్టంగా భావిస్తున్నాం. తప్పుడు కార్యక్రమాలను కట్టపెట్టాలని మంత్రి పేర్న నాని హితవు పలికారు.