కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ

మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం

తాడేపల్లి: సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులకు బ్రహ్మరథం పట్టారని, త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీసుకోవాల్సిన వ్యూహాలపై మంత్రి పెద్దిరెడ్డి దిశా నిర్దేశం చేశారు. 

మున్సిపాలిటీల్లోనూ విజయం సాధిస్తాం : మంత్రి పెద్దిరెడ్డి
భేటీ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచ్‌ ఎన్నికల్లో అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో కూడా వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని గట్టి నమ్మకం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను ప్రతిబింబించే విధంగా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు గెలుస్తామని విశ్వాసం ఉందన్నారు. కృష్ణా జిల్లాలో గుడివాడ, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగడం లేదని, ఎన్నికలు జరిగే మిగతా అన్ని చోట్ల వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందన్నారు. కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలతో రివ్యూ చేయడం జరిగిందని, సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడం జరిగిందని చెప్పారు. 
 

Back to Top