పోలీసు శాఖ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విప్ల‌వాత్మ‌క మార్పులు తెచ్చారు

ఆల‌యాల‌పై దాడులు ప్ర‌తిప‌క్షాల కుట్ర‌లో భాగ‌మే

దళితులపై దాడులు తగ్గాయి

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత

 
అనంతపురం:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పోలీసు శాఖ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తెచ్చార‌ని హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత పేర్కొన్నారు. మహిళల భద్రతకు పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శుక్రవారం అనంత‌పురం పోలీసు శిక్ష‌ణా క‌ళాశాల‌లో ఎస్ఐల పాసింగ్ ఔట్ పెరెడ్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా మంత్రి సుచ‌రిత‌, డీజీపీ గౌతం స‌వాంగ్ పాల్గొన్నారు. 

శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణే సీఎం ల‌క్ష్యం 
 శాంతి భద్రతల పరిరక్షణే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మేక‌తోటి సుచ‌రిత‌ పేర్కొన్నారు. ‘ఏపీ పోలీస్‌ సేవా యాప్‌’ ద్వారా ప్రజల చెంతకే పోలీసు సేవలు తీసుకువచ్చామని తెలిపారు. ‘దిశ’ యాప్‌ను 11 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వెల్లడించారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ ఈ-ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  

రాష్ట్రానికి 37 జాతీయ పుర‌స్కారాలు దక్కాయి..

  ప్రతి గ్రామంలో మహిళా మిత్రలు, సచివాలయాల్లో పోలీసు కార్యదర్శులు నియామకాలు చేపట్టినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు 37 జాతీయ పురస్కారాలు దక్కాయని తెలిపారు. అత్యంత పకడ్బందీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కానిస్టేబుళ్లకు రూ.40 లక్షలు, హోంగార్డులకు రూ.30 లక్షల ఉచిత బీమా అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.

కుట్ర రాజ‌కీయాలు
ఏపీలో ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని సుచరిత మండిపడ్డారు. దళితులపై దాడులు తగ్గాయని.. ఆలయాలపై దాడులు కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్‌ ప్రభుత్వానికి మంచి పేరు రావటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలనూ ఉపేక్షించొద్దని సీఎం వైయ‌స్ జగన్ ఆదేశించారని సుచరిత పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డ‌మే పోలీసుల బాద్య‌త‌:  డీజీపీ

ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డ‌మే పోలీసుల బాద్య‌త అని డీజీపీ గౌతం స‌వాంగ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేష‌న్ల‌ను ఉమెన్ ఫ్రెండ్లీగా మార్చేశామ‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాష్ట్రంలో దిశ చ‌ట్టం తీసుకువ‌చ్చి మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించార‌న్నారు.దిశ చ‌ట్టం ద్వారా 21 రోజుల్లో దోషుల‌కు శిక్ష ప‌డుతుంద‌ని చెప్పారు. ఏపీ పోలీసు వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శ‌మ‌ని కొనియాడారు. ఏపీ పోలీసు సేవా యాప్ ద్వారా ప్ర‌జ‌ల‌కు నేరుగా సేవ‌లు అందుతాయ‌ని డీజీపీ చెప్పారు.

Back to Top