వచ్చే ఏడాది కూడా నంబర్‌.1 స్థానంలో నిలుస్తాం

రాబోయే రోజుల్లో విశాఖను వరల్డ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్‌ సీఈఓ అభినందించారు

డిసెంబర్‌ 1కల్లా స్కిల్‌డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

విజయవాడ: వచ్చే ఏడాది కూడా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంప్లాయిమెంట్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సర్వే జరుగుతుందని వివరించారు. విజయవాడ మంత్రి గౌతమ్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్‌ 1వ తేదీ వరకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ప్రారంభమవుతుందన్నారు. ఐదు కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నామని, యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం అందిస్తామన్నారు. 

రాబోయే రోజుల్లో విశాఖను వరల్డ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వివరించారు. నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌కాంత్‌ ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని అభినందించారని, అక్టోబర్‌లో విశాఖ రానున్నారని, విశాఖలో నాడు–నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్న పాఠశాలతో పాటు, ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను పరిశీలిస్తారన్నారు. 8 ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందని ఆయన చెప్పారని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 

రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులపై కేంద్రాన్ని అడిగామని మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు. పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌తో పాటు, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. డిసెంబర్‌ 15 నాటికి భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తీర ప్రాంతంలో అనేక పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. 

 

Back to Top