నెల్లూరు: హెల్త్ యూనివర్సిటీకి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సముచితమే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గత రెండు, మూడ్రోజులుగా చూస్తే టీడీపీ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్లు చాలా దారుణంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కుప్పం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి అక్కడ ప్రజలు ఘన స్వాగతం పలకడాన్ని చూసి ఓర్వలేకే. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా జగన్గారు సీఎం హోదాలో వెళితే కుప్పం ప్రజలు నీరాజనాలు పలికారు. దాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు ఫ్రస్ట్రేషన్తో రకరకాల విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ఆదివారం నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. - చంద్రబాబు నాయుడు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కుప్పం అభివృద్ధికి చేసిందేమీ లేదు. కుప్పం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం. అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు అభివృద్ధి, సంక్షేమాన్ని కుప్పంతో సహా రాష్ట్ర ప్రజలందరికీ రుచి చూపించారు. కుప్పం నియోజకవర్గపు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను జగన్ గారు సమర్థవంతంగా, సంపూర్ణంగా అందించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తమ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయినా... వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా అన్ని నియోజకవర్గాలతో పాటు తమ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశారని కుప్పం ప్రజలు భావిస్తున్నారు. *తన సొంత నియోజకవర్గంలా కుప్పంను అభివృద్ధి చేసిన జగన్ గారు* ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం అన్న వివక్ష చూపకుండా జగన్ మోహన్ రెడ్డిగారు తన సొంత నియోజకవర్గాన్ని ఏవిధంగా చూసుకున్నారో ... ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని కూడా అలాగే అభివృద్ధి చేశారు. దీన్ని గ్రహించిన కుప్పం ప్రజలు కృతజ్ఞతా భావంతో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిగారి సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీంతో ఇంతకాలం టీడీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు అల్లిన కట్టు కథలన్నీ ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి. సీఎం పర్యటన సందర్భంగా సభ ఆలస్యంగా ప్రారంభం అయినా.. ఓపిగ్గా ప్రజలు ముఖ్యమంత్రిగారి కోసం ఎదురు చూశారు. *కుప్పంలో డిగ్రీ కాలేజీ కూడా వైఎస్ఆర్ గారు మంజూరు చేసిందే..* కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో మంజూరు అయిందే. 33 ఏళ్ల పాటు కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు చివరకు తాను చదువుకున్న స్కూలునే నిర్లక్ష్యం చేశారు. అలాంటి వ్యక్తి ప్రజలు గురించి పట్టించుకుంటారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. శాసన సభ్యుడిగా, ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసిన వ్యక్తి కుప్పానికి చేసిందేమీ లేదు. మెడికల్ కాలేజీ మంజూరు అయినా దాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించాడు. కనీసం పేద ప్రజలకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి హోదాలో నీరుగార్చారు. చంద్రబాబు నాయుడు ఏరోజు అయినా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్నారా?. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాపురం ఉంటున్నాడు. ఏపీకి విజిటింగ్ ప్రొఫెసర్లాగా వస్తూ జనాల్ని రెచ్చగొట్టడం తప్ప రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా అని సూటిగా అడుగుతున్నాం. కోవిడ్ సమయంలోనూ తండ్రికొడుకులు హైదరాబాద్లో తలదాచుకున్నారు. - ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి లింగమనేని గెస్ట్హౌస్లో చంద్రబాబు తలదాచుకున్నాడు. అధికారంలో ఉన్ననాళ్ళు ఉద్యోగుల్ని, ప్రజలను అనేక కష్టాలపాలు చేశాడు. అంతకన్నా చంద్రబాబు చేసిన ఘనకార్యం ఏంటని ప్రశ్నిస్తున్నాం. 33ఏళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు అక్కడ సొంత ఇల్లు కూడా లేదు. ఇవాళ కుప్పం ప్రజల్లో వస్తున్న తిరుగుబాటు, వ్యతిరేకత కారణంగా అభద్రతా భావంతో చంద్రబాబు ఇన్నాళ్లకు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ ఘటనే చంద్రబాబు తిరోగమనానికి నిదర్శనం. ముఖ్యమంత్రిగా ఏమీ చేయలేకపోయిన చంద్రబాబు చివరకు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్గారికి లేఖ రాశారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తోంది. *చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది* చంద్రబాబుది టెర్రరిస్ట్ మెంటాలిటీ. రాజకీయ ఉగ్రవాది అయిన ఆయన నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేవరకు తాను ఏం కుట్రలు చేస్తే నాలుగు ఓట్లు పడతాయి అనే ఆలోచనే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోడు. జగన్ మోహన్ రెడ్డిగారు కుప్పం ప్రజల గురించి ఆలోచించి అక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే అందుకు గుడివాడ ఘటనే నిదర్శనం. కొన్ని పత్రికల్లో చూశాం... వాహనాలు ఎక్కి తొడలు కొట్టడం. జగన్ గారికి కుప్పంలో జనం బ్రహ్మరథం పట్టడాన్ని జీర్ణించుకోలేకే చంద్రబాబుకు కడుపుమంటగా ఉంది. *గుడివాడలో తొడలు కొట్టిస్తే ఏం వస్తుంది..* కుప్పంలో జరిగిన అవమానాన్ని గుడివాడలో తీర్చుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనే కనిపించింది. ఎన్టీ రామారావుగారి సొంత నియోజకవర్గంలో కొడాలి నానిగారిని ప్రజలు గెలిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నాయకత్వం తమకు ఉండకూడదనే గుడివాడ ప్రజలు టీడీపీని ఓడించారు. కొడాలి నానిగారు నీపై గళమెత్తుతున్నారు కాబట్టి నువ్వు గుడివాడలో మహిళల చేత తొడలు కొట్టించి, పగ తీర్చుకోవాలనే ఆలోచన తప్ప మరోకటి లేదు. రాజకీయంగా ఎప్పుడో దిగజారిపోయిన చంద్రబాబు ఇవాళ నైతికంగా కూడా దిగజారిపోయారనేది ఇదో ఉదాహరణ. *బాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా..?* చంద్రబాబు తన హయాంలో చేసింది శూన్యం. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో దాదాపు 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మూడు వైయస్సార్ గారి హయాంలో, గత ప్రభుత్వాల హయాంలో 8 వచ్చాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క మెడికల్ కాలేజీ అయినా వచ్చిందా? కుప్పంలో మెడికల్ కాలేజీని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించావు. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. అవన్నీ ప్రారంభం అవుతున్నాయి. సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు తెచ్చుకోగలిగితే విద్యార్థులకు విద్యతో పాటు స్థానిక ప్రజలకు వైద్యం అందించే ఉద్దేశంతో వాటిని ప్రారంభిస్తున్నారు. *మరి, ఆరోగ్యశ్రీ పేరు ఎందుకు మార్చావు బాబూ..?* చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పేరు మార్చావు. ఆ పథకం ద్వారా అందుబాటులోకి వచ్చే సేవలను కుదించావు. అసలు ఆరోగ్యశ్రీ పథకం ఎన్నడైనా నీ మదిలో తొలిచిందా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చామని రాద్ధాంతం చేస్తున్న నువ్వు ఆరోగ్యశ్రీ పేరు ఎందుకు తొలగించావు? వైద్య సేవలను ఎందుకు తగ్గించావని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 108 వైద్య సేవలను అటకెక్కించింది నీవు కాదా బాబూ? వాటన్నిటి పేర్లు తొలగించింది, పేర్లు మార్చింది నువ్వు కాదా? - జగన్గారు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలో అదనంగా వైద్య సేవలను చేర్చారు. మా ప్రభుత్వంలో 108, 104 వైద్య సేవలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వెన్నుపోటు పొడిచాక, టీడీపీ సభ్యత్వం పుస్తకాల మీద ఎన్టీ రామారావు ఫోటో ఉండేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడమే కాకుండా చివరకు ఘోర అవమానం చేశాడు. ఇవాళ ఎన్టీఆర్ పై మొసలి కన్నీరు కార్చితే ప్రజలు గమనించరనుకుంటున్నావా? - విద్యా రంగానికి చంద్రబాబు చేసింది శూన్యం. వైఎస్ జగన్గారు నాడు- నేడు ద్వారా విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి చేశారు. విద్యా, వైద్య రంగానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. నాడు వైయస్సార్గారు అమలు చేస్తే దాన్ని ఆయన కుమారుడు జగన్గారు కొనసాగిస్తున్నారు. రుణమాఫీ అంటూ రైతుల్ని మోసం చేసింది బాబు కాదా? చంద్రబాబు హయాంలో పంటలే పండలేదు. ఇంకా గిట్టుబాటు ధరల గురించి, వ్యవసాయ రంగం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. - ఏ వ్యక్తి అయితే ఆ రంగాల్లో విశేష కృషి చేస్తారో ఆ వ్యక్తుల పేరును పథకాలకు పెట్టుకోవడం ఆనవాయితీ. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైతే, ఆవ్యక్తి పేరును శాశ్వతంగా ఒక జిల్లాకు పెట్టారు జగన్ గారు. ఎన్టీఆర్గారి పట్ల అభిమానం ఉంది కాబట్టే ఆయన పేరుతో జిల్లా పెట్టాం. ఎన్టీ రామారావుగారి పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో ప్రజలకు తెలుసు, తెలుగుదేశం పార్టీ క్యాడర్కు కూడా తెలుసు. మళ్లీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి పారిపోయాడు. *అమరావతి యాత్రకు కథ, స్క్రీన్ ప్లే బాబే* అమరావతి యాత్ర రైతుల యాత్ర ఎలా అవుతుంది. ఆ యాత్రకు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం చివరకు నిర్మాత కూడా చంద్రబాబు నాయుడే. అన్నిరకాలుగా వారికి అండగా ఉంటూ వారికి పసుపు పచ్చ కండువాలు కాకుండా ఆకుపచ్చ కండువాలు కప్పుతున్నావు. మీ కార్యకర్తల్ని, శ్రేణులకు ఆకుపచ్చ కండువాలు వేసి రైతు యాత్ర అని తిప్పుతున్నావు. దాన్ని అమరావతి యాత్ర అంటే ఎలా? ఆడవాళ్లతో తొడలు కొట్టించే నీచ సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? చంద్రబాబుకు కావాల్సింది వివాదాలు... అల్లర్లు, గొడవలు.. ఏదోవిధంగా రెచ్చగొట్టి గొడవలు సృష్టించడమే లక్ష్యం. రాష్ట్రం సుభిక్షంగా, శాంతియుతంగా ఉండకూడదనేది ఆయన ఆలోచన. రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించని వ్యక్తి ఇవాళ వాళ్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. - రాజధాని రైతులే ఆ యాత్రలో ఉంటే మంగళగిరిలో నీ సుపుత్రుడు ఎందుకు ఓడిపోయాడు బాబూ..? మీ పాలన మీద వ్యతిరేకత తోనే అక్కడ నీ పుత్రుడిని ఘోరంగా ప్రజలు ఓడించారు. ఎన్నికల్లో బోల్డన్ని హామీలు ఇవ్వడమే కాకుండా, కొడుకు గెలుపుకు వేలకోట్లు ఖర్చుపెట్టావు కదా? అయినా నీ కొడుకును ఎందుకు ఓడించారు. అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు తనకు వ్యతిరేకంగా ఉన్నారని అప్పుడైనా చంద్రబాబుకు అర్థం కావాలి కదా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా జాగ్రత్తగా మసులుకోవాలి తప్ప, రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సరికాదు. *అందుకే యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు* వైద్యరంగానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు.. ఇప్పుడు ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డిగారు. వారి నేతృత్వంలో జరిగిన అభివృద్ధికి గుర్తుగా, భవిష్యత్ తరాలు మాట్లాడుకునే విధంగా ఆలోచన చేసి హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి పేరు పెట్టారు. అంతేతప్ప మీకులా అందరికీ వంకర బుద్ధి, దుర్బుర్థి ఉంటుందనుకుంటే పొరపాటు. మీకులా ఎన్టీఆర్గారి పట్ల అందరూ ప్రవర్తిస్తారనుకోవడం దుర్మార్గమైన విషయం. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చెంపలు వేసుకుని మౌనంగా ఉంటే మంచిది. విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే జనాలు మిమ్మల్ని బయట కూడా తిరగనివ్వకుండా చేస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, గొడవలు సృష్టించాలని చంద్రబాబు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించవని గమనిస్తే మంచిది. నూటికి నూరుపాళ్లు హెల్త్ యూనివర్శిటీకి రాజశేఖర్ రెడ్డిగారు పేరు పెట్టడం సముచితమని భావిస్తున్నాం. - చంద్రబాబు నాయుడు బతికున్నంతవరకూ నారా కుటుంబమే తప్ప... నందమూరి కుటుంబం బయటకు రాదు. ఇది జగమెరిగిన సత్యం. జై జూనియర్ ఎన్టీఆర్ అని పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తుంటే.. నోరుముయ్యమని చంద్రబాబు అంటున్నాడు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే.. టీడీపీని నందమూరి కుటుంబానికి ఇవ్వాలని ప్రజలతో పాటు టీడీపీ క్యాడర్ కూడా కోరుకుంటుంది.