నెల్లూరు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్తికర స్థాయిలో పింఛను అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కొక్కరికి నెలకు రూ.2,750 పింఛన్ రూపంలో ఇస్తున్నామని తెలిపారు. వైయస్ఆర్ పింఛన్ కానుక వారోత్సవాల్లో మంత్రి పాల్గొని నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గతంలో పింఛన్లు పొందాలంటే జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉండేదని, అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి మాత్రమే కొత్త పింఛన్లు ఇచ్చేవారని, లేదా గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి స్తానంలో కొత్త పింఛన్లు ఇచ్చేవారు అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నడూ లేని విధంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి వాలంటీర్ల ద్వారా సంవత్సరానికి రెండుసార్లు ఎవరు ప్రమేయం లేకుండానే అర్హతేప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రస్తుతం పొందుతున్న 2500 కు మరో 250 రూపాయలు పెంచి మొత్తం 2750 రూపాయలను జనవరి 1వ తేదీనుంచి అందజేస్తున్నామని తెలిపారు. నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లాలో కొత్తగా 12332 మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో పొందుతున్న పింఛన్లు 3,03,472 కాగా నేడు 3,15,804 మందికి పింఛన్ల కోసం 87.70 కోట్ల రూపాయలను ప్రతినెల ఖర్చు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం కేవలం 39 లక్షల మంది లబ్ధిదారులకు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. నేడు తమ ప్రభుత్వం 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 1765 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం పింఛన్ల కోసం గత ప్రభుత్వం 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా తమ ప్రభుత్వం 21,230 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, గత మూడు సంవత్సరాలుగా 65 వేల కోట్ల రూపాయల పింఛన్లను పంపిణీ చేశామని తెలిపారు. ఈ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కే దక్కుతుందన్నారు.