చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?

 మంత్రి జోగి రమేష్‌
 

తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్‌. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.

కాగా, మంత్రి జోగి రమేష్‌ శనివారం మీడియాతో​ మాట్లాడుతూ..‘చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడ్నుండి‌ ఎక్కడకు వెళ్లారు?. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లోమీడియా రాసింది. అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళ్లారు?. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా మురిదిపోయింది.

ఈ రహస్య పర్యటన వెనుక‌ కారణం ఏంటి?. దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి వెళ్లారా?. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు?. అసలు ఈ పది రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు?. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?. ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలి.

అవినీతిపరుడైన ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు. దేవినేని ఉమా సహా అందరూ వెళ్లి అవినీతిపరుడిని సత్కరించారు. ఈరోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మూర్చ వస్తుంది. ఆ రోజున కూటమి కుదేలవుతుంది. వైయ‌స్ఆర్‌ సీపీ​ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలి. పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి. సీఎం వైయ‌స్ జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Back to Top