అన్నదాత సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

 రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 

కర్నూలు : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. డాక్టర్ వైయ‌స్సార్ రైతు భరోసా పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభించారు.

క‌ర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ మల్కి రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డి, కెడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ ఎన్ మహాలక్ష్మి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎంకెవి శ్రీనివాసులు, అగ్రికల్చర్ జెడి వరలక్ష్మి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడో ఏడాది రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా సహాయాన్ని అందించార‌ని తెలిపారు. రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు వైయ‌స్సార్‌ సున్నావడ్డీ కింద రాయితీ జమ చేసి  అండగా నిలిచామన్నారు.
 సాగు ఖర్చు తగ్గించేందుకు అవసరమైన యంత్ర పరికరాలను వైయ‌స్సార్‌ యంత్ర సేవాపథకం కింద సబ్సిడీ సొమ్ము రైతు పొదుపు సంఘాలకు జమ చేశామన్నారు. దీంతో వ్యవసాయం పై రైతుల్లో మరింత మక్కువ పెరిగిందన్నారు. గ్రామసీమల్లో రైతులు సాగుబడిని పండగ వాతావరణంలో చేపడుతున్నారన్నారు. వాస్తవ సాగుదారులు అందరికీ సాయం అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

మెగా చెక్కు పంపిణీ: 
డాక్టర్ వైయస్ ఆర్ రైతు భరోసా పథకం రెండో విడత సంబంధించి కర్నూలు జిల్లాలోని 4,70,381 రైతు కుటుంబాలకు రూ 98.14 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలు (ఖరీఫ్- 2020) 77,136 మందికి రూ.16.40 కోట్లు పంట రుణాలు వడ్డీ జమ, వైయస్సార్ యంత్ర సేవ పథకం సంబంధించి కర్నూలు జిల్లాలోని 197 రైతు గ్రూపుల ఖాతాలకు రూ.2.52 కోట్లు జమ మెగా చెక్కులును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ మల్కి రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి.భరత్ కుమార్ రెడ్డిలు రైతులకు అందజేశారు.

Back to Top