విశాఖపట్నం: ఏడాది పాలనలోనే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. జూన్ 8వ తేదీ నుంచి హరిత హోటల్స్ తిరిగి ప్రారంభిస్తామన్నారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. హరిత హోటల్స్లో ఆన్లైన్ బుకింగ్ ప్రారంభిస్తామన్నారు. ఆదాయ మార్గాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఫెస్టివల్, ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నామని, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధి చేపడుతున్నామన్నారు. గండికోట వద్ద అడ్వెంచర్ స్పోర్ట్స్కి ఇతర రాష్ట్రాల పర్యాటకులు వస్తున్నారన్నారు. టెంపుల్ టూరిజంపై దృష్టిసారించామని మంత్రి అవంతి చెప్పారు. అరకు, లంబసింగి, అరసవిల్లి, శ్రీకూర్మం, ప్రాంతాలకు టూరిజం బస్సులు ఏర్పాటు చేయనున్నామని, శిల్పారామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.