సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో.. జవాబుదారీ తనం, పూర్తి పారదర్శకత, అవినీతి రహితం ఈ మూడు అంశాలు ఏ శాఖలోనైనా ప్రధానంగా ఉంటాయని, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. టీచర్ల బదిలీలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధిపొందాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నాడన్నారు. టీచర్లకు, ప్రభుత్వానికి మధ్య తేడా వచ్చింది.. మనం దూరి రాజకీయం చేసి ఉనికి కాపాడుకుందామని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. రూల్స్కు వ్యతిరేకంగా.. ఉపాధ్యాయ సంఘాలకు తెలియకుండా బదిలీలు చేస్తున్నామని నిరూపించగలరా చంద్రబాబూ..? అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఛాలెంజ్ విసిరారు. సచివాలయంలో మంత్రి సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి సురేష్ ఇంకా ఏం మాట్లాడారంటే.. – విద్యుత్ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అడిగితే వారిపై లాఠీ చార్జ్ చేయించి గుర్రాలతో తొక్కించిన ఘనత ఎవరిది. – 2018లో అక్రమ బదిలీలు చేశారని ప్రశ్నించినందుకు డీఎస్సీ నిర్వహించలేదని, ధర్నాలు చేస్తే పాఠశాలలకు వెళ్లి మరీ ఉపాధ్యాయులను అరెస్టు చేసింది ఎవరూ..? 2018లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు కాదా..? – పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం లేదని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, గుడ్లు ఇవ్వడం లేదని, యూనిఫామ్స్ పంపిణీ చేయలేదని ఉపాధ్యాయులు రోడ్ల మీదకు ధర్నాకు వస్తే స్కూళ్లకు వెళ్లి మరీ అరెస్టు చేయించారు. – చంద్రబాబు చేసిన తప్పిదాలకు ప్రతి ఒక్క ఉద్యోగికి క్షమాపణ చెప్పాలి. ఏం మొహం పెట్టుకొని టీచర్ల గురించి మాట్లాడుతున్నావ్ బాబూ.. లేని సమస్యను సృష్టిస్తూ టీచర్ల బదిలీలో రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. – వెబ్ కౌన్సెలింగ్ గురించి పదే పదే చెప్పాం. ఇది సీఎం వైయస్ జగన్ పాలన. జవాబుదారీ తనం, పూర్తి పారదర్శకత, అవినీతి రహితం ఈ మూడు అంశాలు ఏ శాఖలోనైనా ప్రధానంగా ఉంటాయి. – ఎప్పటిదో క్లిప్పింగ్ తీసుకొచ్చి సోషల్ మీడియా పెట్టి అవినీతి జరిగిందని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలో రూల్స్కు వ్యతిరేకంగా.. ఉపాధ్యాయ సంఘాలకు తెలియకుండా చేస్తున్నామా..? నిరూపించగలరా..? – సీనియారిటీ, సర్వీస్ పాయింట్స్, హెడ్మాస్టర్కు మినిమం క్వాలిఫైంగ్ అన్నీ మార్పు చేసి జీవోను విడుదల చేశాం. జీఓ 53, 54, 59 ప్రకారమే బదిలీల ప్రక్రియ చేపట్టాం.