సంక్షేమాన్ని అందించాం కాబట్టే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం

తిరుపతిలో వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఎప్పుడో ఖాయమైంది

పవన్‌ చేసింది మాత్రం టీడీపీకి కరెక్ట్‌గా కనిపిస్తోందా..?

ఎంతమంది సాబ్‌లు కలిసొచ్చినా మా సీఎం సాబ్‌ను ఏమీ చేయలేరు

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజం

నెల్లూరు: ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించాం కాబట్టే వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేయాలని ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో లక్షల మెజార్టీతో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీకి దిక్కులేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ విగ్రహాలు ధ్వంసం చేసి.. ఉదయాన్నే రచ్చ చేస్తుందని, సాక్షాత్తు శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు మనుషులు నంది విగ్రహాన్ని ఎలా ఎత్తుకెళ్లారో ప్రజలంతా చూశారన్నారు. ఆ ఘటనపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 

టీడీపీ, బీజేపీలు కుమ్మకై మత రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి అనిల్‌ ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేసి 24 గంటలైనా టీడీపీ సమాధానం లేదు.. సవాల్‌ను స్వీకరించే దమ్ముందా.. లేకపోతే తోకముడిచామని ఒప్పుకోండి అని సూచించారు. సీఎం జగన్‌ సభ పెడితే లక్షలాది మంది జనం తరలివస్తారు. ప్రజారోగ్యం దృష్ట్యా తిరుపతి సభను సీఎం రద్దు చేసుకున్నారన్నారు.  వ్యక్తిగత సిబ్బందికి కరోనా వస్తేనే పవన్‌ లోపల ముడుచుకొని కూర్చుంటే ఎవరూ మాట్లాడటం లేదు.. ఇదెక్కడి న్యాయం..? ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం సభను వాయిదా వేసుకుంటే కరెక్టు కాదు.. పవన్‌ చేసింది మాత్రం టీడీపీకి కరెక్ట్‌గా కనిపిస్తోందా..? అని ప్రశ్నించారు.

వకీల్‌సాబ్‌ టికెట్ల గురించి చంద్రబాబుకు ఏం సంబంధం..? పెద్ద రెమ్యూనేషన్‌ తీసుకొని కూడా టికెట్ల ధర పెంచుకొని అభిమానులకు దోచుకోవడం కరెక్టా..? అని ప్రశ్నించారు. టికెట్ల ధర పెంచాలనడం బ్లాక్‌ మార్కెట్‌ కాదా..? అని మంత్రి అనిల్‌ ధ్వజమెత్తారు. సినిమా ఖర్చును ప్రజల మీద రుద్దడం ఎంత వరకు కరెక్టు..? వకీల్‌సాబ్‌ను చూసి సీఎం వైయస్‌ జగన్‌ భయపడ్డాడు అని కొందరు మాట్లాడుతున్నారని, ఇలాంటి సాబ్‌లు వందమంది కలిసొచ్చినా మా సీఎం వైయస్‌ జగన్‌ సాబ్‌ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తిరుపతిలో వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఎప్పుడో ఖాయమైందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు. 

 

Back to Top