చంద్రబాబు ఇకనైనా మైండ్‌ సెట్‌ మార్చుకో..

చరిత్రలో లేని చరిత్రాత్మక బిల్లులను తీసుకువచ్చాం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేశాం

సామాజిక విప్లవానికి సీఎం వైయస్‌ జగన్‌ నాంది పలికారు

40 ఏళ్ల అనుభవంలో ఇలాంటి చట్టాలు ఎప్పుడైనా చేశారా బాబూ

యువతకు ఉద్యోగాలు, కౌలు రైతు రక్షణకు టీడీపీ వ్యతిరేకమా

ప్రతిపక్ష నేత చంద్రబాబు సమాధానం చెప్పాలి

గత ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చకు టీడీపీ సిద్ధమా

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సవాల్‌

విజయవాడ: దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక చట్టాలను తీసుకువచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. చరిత్రాత్మకమైన బిల్లులు, నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎక్కడ ఉన్నారని మంత్రి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, పోస్టులు, దేవాలయాల పాలక మండలిలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే నిర్ణయాలు సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారన్నారు. చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు భాగస్వాములు కాలేదని, బడుగు, బలహీనవర్గాలకు చంద్రబాబు వ్యతిరేకమా అని ప్రశ్నించారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటుంటారు. 40 ఏళ్ల అనుభవం దేవుడెరుగు కానీ, మీ అనుభవంలో ఎప్పుడైనా ఇలాంటి చట్టాలను శాసనసభల్లో ప్రవేశపెట్టడం చూశారా..? చంద్రబాబు చేయని మంచి పనులను 40 ఏళ్ల వయస్సున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చంద్రబాబు వ్యతిరేకమా అని నిలదీస్తున్నాం. 

చట్టసభలు ఏ విధంగా నిర్వహించాలనే సంప్రదాయాన్ని చాలా ఏళ్ల తరువాత ప్రజానీకం చూస్తోంది. గత ఐదు సంవత్సరాల్లో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి, ఫిరాయింపుదారులకు మంత్ర పదవులు కట్టబెట్టి శాసనసభలను మలినం చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన చట్టాల ద్వారా ఆ మలినాన్ని కడిగేశారని రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆలోచన, దార్శనికత ప్రజలంగా గమనించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జ్యోతిరావుపూలే భావాజాలాలను సీఎం వైయస్‌ జగన్‌ పునికిపుచ్చుకొని సామాజిక విప్లవం తీసుకువచ్చారు. బీసీ శాశ్వత కమిషన్, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడం చరిత్రాత్మక అడుగు అని ప్రజలంతా భావిస్తున్నారు. 

చంద్రబాబు కృష్ణా నది కరకట్ట మీద అక్రమ నివాసంలో ఉంటూ మీడియా ముందుకు వచ్చి ప్రగాల్భాలు పలుకుతున్న వైనాన్ని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. అసెంబ్లీలో చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతిని ఆకాంక్షిస్తే ఎందుకు సభలో ఎందుకు పాల్గొనలేదు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు సభ నుంచి తప్పించుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారనే వైనాన్ని ప్రజలు గమనిస్తారనే భయంతో చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయారని అందరూ భావిస్తున్నారు. బిల్లులపై చర్చలో ప్రతిపక్ష నాయకుడు పాల్గొనలేదంటే కచ్చితంగా వారు ఈ బిల్లులకు వ్యతిరేకమేనని భావిస్తున్నాం. దశలవారీగా మద్య నిషేదాన్ని అమలు చేసేందుకు బిల్లు తీసుకువస్తే మద్యం నిషేదానికి అనుకూలమా.. వ్యతిరేకమా చంద్రబాబు సమాధానం చెప్పాలి. పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లు పెడితే చర్చలో పాల్గొనకుండా మళ్లీ ఎల్లో మీడియాలో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తలను వండివార్చారు. అంటే చంద్రబాబు స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా భావించాలి. లోకాయుక్త ఏర్పాటు సవరణ బిల్లు తీసుకువస్తే దానికి అనుకూలమా.. వ్యతిరేకమా సమాధానం చెప్పాలి. కౌలు రైతుల రక్షణకు చట్టాన్ని తీసుకువస్తే మీరు ఎక్కడున్నారు చంద్రబాబూ అని ప్రశ్నిస్తున్నా.

కులాల మధ్య చిచ్చుపెట్టి.. వారిని విడదీసి ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని, వారికి ఏమైనా మేలు చేయాలంటే మనసురాని మీ నైజం ప్రజలంతా గమనించారు చంద్రబాబూ. కేవలం ఎన్నికల ముందు మీరు పెట్టిన పథకాలను ఓట్లు కొనుగోలు చేసే పథకాలుగానే ప్రజలు భావించారని చంద్రబాబు గ్రహించాలి. సీఎం వైయస్‌ జగన్‌ ఎంతో దూరదృష్టితో భావితరాల భవిష్యత్తుకు, దళిత జాతి అభ్యున్నతికి బాటలు వేశారని అసూయ, దురద్దేశ్యంతో వాకౌట్‌ పేరుతో అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. చట్టాలు చేస్తున్న సమయంలో ప్రతిపక్షం సలహాలు కావాలని సభా నాయకులు, సీఎం వైయస్‌ జగన్‌ కోరినా.. సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినా ఏదో ఒక నెపంతో బయటకు వెళ్తున్నారు. 

చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, ప్రాజెక్టులో జరిగిన కుంభకోణంపై విచారణ జరుగుతుంది. ప్రతి వంద కోట్ల రూపాయలు దాటిన ప్రతిపనిని ముందస్తు న్యాయ పరిశీలన కింద జ్యుడిషియల్‌ కమిషన్‌ సమీక్షిస్తుందని సభ నుంచి పారిపోయారా చంద్రబాబూ. అవినీతి రహిత సమాజం కోసం బిల్లును ప్రవేశపెడుతుంటే అవినీతి కావాలని సభ నుంచి వెళ్లిపోయారా అని ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 80శాతం పై మేరకు కేటాయింపులు కూడా బడ్జెట్‌లో ప్రవేశపెడితే ప్రతిపక్షనేతగా చర్చించాల్సిన విషయం మర్చిపోయి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ బయటకు వచ్చి లేనిది ఉన్నట్లుగా.. ఉన్దని లేనట్లుగా మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడి మీ తాబేదారులు, మీ ఆర్థిక బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి గత ఐదేళ్లలో దోచుకుంది వాస్తవం కాదా..? ఇప్పటికైనా చంద్రబాబు మైండ్‌ సెట్‌ మార్చుకోకపోతే 23 సీట్లు కూడా దక్కవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు. 50 రోజుల్లో సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న కార్యక్రమాలు.. 40 సంవత్సరాల ఇండస్ట్రీలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాలు విసిరారు.

 

Back to Top