విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహారం ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు.. ప్రగతి గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన హయాంలో రూ. 5 లక్షల కోట్లు పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు తెచ్చామని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూల్లో కేవలం రూ. 34 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి.. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటే కేవలం 2 శాతం మాత్రమే గ్రౌండ్ అయ్యాయని వెల్లడించారు. జిందాల్ స్టీల్ సంస్థ వైయస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. మొదటి విడతకు త్వరలోనే భూమి పూజ చేపట్టనున్నాం.. వైయస్ఆర్ జిల్లా ప్రజల చిరకాల వాంఛను తీర్చనున్నాం అన్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటే నాటి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని దుయ్యబట్టారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.. ఏపీలోని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు విషయంలో దేశానికి దిక్సూచిగా ఉందన్నారు. ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టే అవకాశం ఉందో పబ్లిక్ డొమైనులోనే ఉందని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పీఎస్పీల ద్వారా ఆదాయం వస్తోందన్నారు. 13500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతం ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిందన్నారు. 20 వేల మెగా వాట్లను పీఎస్పీల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు.. మరిన్ని ప్రాజెక్టులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తే మేం ఆహ్వానిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అమర్ రాజా వెళ్లిపోయిందన్నారు.. ఇప్పుడు అదే అమర్ రాజా రూ. 250 కోట్లు పెట్టుబడులు పెడుతోందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో హెరిటేజ్ కంపెనీ పన్నులు కట్టలేదు.. మేము వారిని ఇబ్బంది పెట్టామా..? అని ప్రశ్నించారు. ప్రాసెస్ ప్రకారం నోటీసులిచ్చారు.. రూ. 60 లక్షలు కట్టారని వెల్లడించారు.. అయితే, పరిశ్రమల వల్ల ఒక్క ప్రాణం పోయినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని స్పష్టం చేశారు. టీడీపీ తరహాలో అబద్దాలు చెప్పం.. చెప్పలేమన్న ఆయన.. తమను 23 స్థానాలకే పరిమితం చేశారని ప్రజలపై.. రాష్ట్రంపై చంద్రబాబుకు కోపం ఉంటే ఎలా..? అని మంత్రి గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.