గుంటూరులో అంగరంగ వైభవంగా జగనన్న స్వర్ణోత్సవాలు..  

గుంటూరు: రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు గుంటూరులో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించ‌నున్న ఈ జోన‌ల్ స్థాయిలో మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్యరీతుల్లో కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, భ‌ర‌త‌నాట్యం, గాత్రాలు, జాన‌ప‌ద క‌ళారూపాల్లో డ‌ప్పులు, గ‌ర‌గ‌లు, త‌ప్పెట‌గుళ్లు, చెక్కభ‌జ‌న‌, పులివేషాలు, బుట్టబొమ్మలు, కాళికా వేషాలు, ఉరుములు, గిరిజ‌న క‌ళారూపాల్లో ధింసా, కొమ్ముకోయ‌, స‌వ‌ర‌, లంబాడీ విభాగాల్లో పోటీలు జరుగుతాయి.  రాష్ట్రంలో ఘనంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి వారితో సంబరాలు జరుతున్న‌ట్లు మంత్రి ఆర్కే రోజా చెప్పారు. తిరుపతి జోన్‌ కళాకారులకు మహతి కళాక్షేత్రంలో నవంబర్‌ 19, 20, 21 తేదీల్లో నిర్వ‌హించామ‌న్నారు.  గుంటూరు జోన్‌ వారికి 24, 25, 26 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, రాజమండ్రి జోన్‌ వారికి 29, 30, డిసెంబర్‌ 1 తేదీల్లో శ్రీవేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో పోటీలు నిర్వహిస్తామన్నారు. విశాఖ జోన్‌ వారికి డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో ఉడా చిల్డ్రన్స్‌ థియేటర్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్‌ 19, 20 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తామని తెలిపారు. కూచిపూడి, ఆంధ్ర నాట్యం, భరత నాట్యం, జానపద కళారూపాలు తదితర కళా రంగాల్లో జోనల్, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామని, ప్రతి విభాగంలో జోనల్‌ స్థాయి విజేతల గ్రూప్‌నకు రూ.25 వేలు, సోలో కి రూ.10 వేలు, రాష్ట్ర స్థాయి విజేతలకు గ్రూప్‌నకు రూ.లక్ష, సోలోకి రూ.50 వేలను సీఎం జన్మదినం రోజున అందజేస్తామన్నారు.    

కళాకారులతో కలసి డాన్స్
జగనన్న స్వర్ణోత్సవ సంబరాల వేడుకలో కళాకారులతో కలసి డాన్స్ వేశారు. కళలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న గుంటూరులో జగనన్న వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి రోజా అన్నారు.  

 

తాజా వీడియోలు

Back to Top