కిడాంబి శ్రీ‌కాంత్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌న్మానం

ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో ర‌జ‌తం సాధించిన శ్రీ‌కాంత్‌

రూ.7 ల‌క్ష‌ల న‌గ‌దు అంద‌జేత‌, తిరుప‌తిలో అకాడ‌మీ ఏర్పాటుకు 5 ఎక‌రాల స్థ‌లం కేటాయింపు

తాడేప‌ల్లి: భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 12 నుంచి 19వ తేదీ వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్‌ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న శ్రీ‌కాంత్‌.. ర‌జ‌త‌ పతకం సాధించారు. ఈ మేర‌కు శ్రీకాంత్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం తరఫున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ప్ర‌స్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా శ్రీ‌కాంత్ విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, శాప్‌ ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ పాల్గొన్నారు. 
 

Back to Top