తాడేపల్లి: రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. `స్వతంత్ర సమరయోధులు, మేధావులు, అంబేద్కర్ లాంటి మహనీయుల మార్గదర్శకత్వంలో రూపొందిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటికీ మార్గదర్శకంగా నిలబడి ఉంది. తరువాత కాలక్రమేనా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. భారత రాజ్యాంగం ఒక పవిత్రమైన గ్రంథం. దాన్ని అంత పటిష్టంగా రూపొందించారు కనుకనే ఈరోజు కూడా దేశ సమగ్రతకు భంగం ఏమాత్రం కలగకుండా కొనసాగుతోంది. దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా, ఎటువంటి దుష్ట శక్తులు, శత్రువులు ఎవరూ ఏమీ చేయలేని విధంగా మన రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు జరుగుతోంది. ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడాలన్న విధానానికి ప్రాతిపదికగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మన రాజ్యాంగం వల్ల స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల జరుగుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి. మన పక్క దేశం పాకిస్తాన్తో పోల్చి చూస్తే మన రాజ్యాంగం గొప్పదనం ఎటువంటిదో అర్థమవుతుంది. మన దేశంలో ఉన్నంత పటిష్టంగా రాజ్యాంగం పాకిస్తాన్లో లేదు. రాజ్యంగాన్ని రూపొందించిన స్వాతంత్ర్య సమరయోధులు, నాయకులు, మేధావులు, బీఆర్ అంబేద్కర్ లాంటి వారు మనకి మార్గదర్శకులుగా, వీరంతా చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. ఈ రాజ్యాంగాన్ని అవసరమైన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ దాన్ని చట్టబద్ధంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు ఈ రాజ్యాంగాన్ని అందించాలన్న అంశాన్ని గుర్తుపెట్టుకుని, అన్ని రాజకీయ పార్టీలు కూడా నడుచుకోవాలి` అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రారెడ్డి, పార్టీ అధికారప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రవిచంద్ర రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్ మరియు పలువురు కార్పోరేషన్ ఛైర్మన్లు, డైరక్టర్లు, పార్టీనేతలు తదితరులు పాల్గొన్నారు.