అసెంబ్లీ: పులిచింతల ప్రాజెక్టు సర్కిల్ ఆఫీస్ ప్రాజెక్టు సమీప ప్రాంతంలోకి మార్చాలని, అదేవిధంగా ప్రాజెక్టు టెక్నీషియన్స్ను అవుట్సోర్సింగ్లో చేర్చి సరైన వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సామినేని ఉదయభాను మాట్లాడారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు కృష్ణాడెల్టాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందన్నారు. 42 టీఎంసీల సామర్థ్యం గల పులిచింతల ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి సుమారు 24 మంది సిబ్బంది (ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, టర్నర్స్) ఉన్నారన్నారు. వారంతా డైలీ బేసిస్ శాలరీ మీద పనిచేస్తున్నారని, వారిని అవుట్సోర్సింగ్ కింద నియమించి సరైన వేతనం ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు సర్కిల్ ఆఫీస్ గతంలో జగ్గయ్యపేటలో ఉండేదని, టీడీపీ హయాంలో తిరిగి వేరే ప్రాంతానికి మార్చారన్నారు. దీని వల్ల ప్రాజెక్టు మీద ఎస్ఈలు, ఈఈల పరిశీలన కొరవడిందని, సర్కిల్ ఆఫీస్ను ప్రాజెక్టు సమీప ప్రాంతంలోకి మార్చాలని కోరారు.