విజయవాడ : సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కార్మిక వర్గానికి పెద్ద పీట వేశారని వైయస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పునూరు గౌతమ్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వైయస్సార్ టీయూసీ సహకార సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ 1987 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థను నీరుకార్చారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రైతుల కోసం సహకార బ్యాంకులను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులకు మంచి రోజులు వచ్చాయని, బ్యాంక్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. సహకార సంస్థ కోసం గతంలో సీఎం వైయస్ జగన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. మా ప్రభుత్వంలో ధర్నాలు ఉండవు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్మికులను మోసం చేశారు. ముఖ్యమంత్రి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వైయస్సార్ టీయూసీలోకి 15000 మంది వచ్చారని చెప్పారు. సహకార ఉద్యోగులకు ప్రమోషన్లు త్వరలోనే వస్తాయని గౌతంరెడ్డి చెప్పారు.