ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 

ఉరవకొండ:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మూడున్నర ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు లభించాయని ఉరవకొండ మాజీ శాసనసభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. గురువారం కూడేరు సచివాలయం-2 పరిధిలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. అదే విదంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీకారం చుట్టారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన చేస్తే నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top