రాజమహేంద్రవరం: ఎన్నిలకు ముందు కూటమి పార్టీలు ఎల్లో మీడియా ద్వారా నిత్యం వైయస్ జగన్పై విషం చిమ్మడం ద్వారానే అధికారంలోకి వచ్చాయని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ పచ్చి అబద్దాలతో ప్రజలను మోసం చేయడం వల్లే కూటమి పార్టీలు అందంల ఎక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కూటమి పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు తెగబడ్డారని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం గోదావరినదీ పరీవాహక ప్రాంతంలో ఏకంగా ఎనబై డ్రెజ్జర్లతో అక్రమంగా ఇసుకను నదీగర్భం నుంచి తోడేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఇసుక మాఫియా వెనుక ఉన్నది ఎవరో బయటపెట్టాలన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి అనేక సత్యదూరమైన అవాస్తవాలనే నమ్ముకున్నారు. తమకు తోడుగా ఉన్న ఎల్లోమీడియా ఈనాడు,ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్ల ద్వారా నిత్యం వైయస్ జగన్పై విషప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారు. ఈ అబద్దాలు, అవాస్తవాలతోనే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో వైయస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా నవరత్నాలను తూచా తప్పకుండా అమలు చేశారు. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ వైయస్ జగన్ ఎంతో ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో ప్రజలను ఆదుకున్నారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయినా కూడా పాలనలో తన సత్తాను చాటుకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు ప్రతిక్షణం ఆయన పనిచేశారు. అప్పులపై దారుణమైన అబద్దాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు నిత్యం అప్పుల పేరుతో అనేక అబద్దాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే బడ్జెట్ సమావేశాలు పెట్టి అప్పులపై వారు చెబుతున్న దానిలో ఎంత మేరకు నిజం ఉందో వెల్లడించాలని ఆనాడే వైయస్ జగన్ డిమాండ్ చేశారు. కానీ దానిపై కూటమి ప్రభుత్వం స్పందించకుండా శ్వేతపత్రాల పేరుతో తాము గతంలో చెప్పిన అబద్దాలనే మరోసారి ప్రజల ముందు పెట్టారు. తరువాత ఆరు నెలలకు పెట్టిన బడ్జెట్లోనే తమ అబద్దాలను తామే ఖండించుకోవాల్సిన పరిస్తితి కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఆర్థికశాఖ మంత్రి వాస్తవాలను వెల్లడించడంతో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు తాము చేసిన దుష్ర్పచారంను సమర్థించుకునేందుకు రకరకాల వాదనలు చేసింది. రాష్ట్ర విభజన తరువాత రూ.1.40 లక్షల కోట్ల అప్పులు ఉంటే, అయిదేళ్ళ తెలుగుదేశం పార్టీ పాలన ముగిసే నాటికి ఈ అప్పులు రూ.3.90 లక్షల కోట్లకు అప్పులు పెంచారు. వైయస్ జగన్ అయిదేళ్ళ పాలనలో చేసిన అప్పులు రూ.3.40 లక్షల కోట్లు. గత టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న వాటితో కలిపితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.7.30 లక్షల కోట్లు. దీనికి వడ్డీ ఎవరు చెల్లిస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన రూ.3.90 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ ఎవరు చెల్లించారు? తాము చేస్తే అది ఒప్పు, తరువాత ప్రభుత్వం చేస్తే మాత్రం తప్పు అనే రీతిలో సోమిరెడ్డి మాట్లాడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరిన చంద్రబాబు అసలు అప్పు చేయడమే తప్పు అన్న చంద్రబాబు, నేడు అప్పు చేయడమే గొప్ప అనేట్లుగా మాట్లాడటం ప్రజలను మోసగించడం కాదా? తమ హామీల అమలులోని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ను బయటకు తీసుకువచ్చారు. ముందుగా శ్వేతపత్రాలను విడుదల చేశారు. తరువాత జరగని కల్తీ జరిగినట్లుగా తప్పుడు ఆరోపణలతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదాన్ని సృష్టించారు. సీఎం స్థానంలో ఉండి జవాబుదారీతనం లేకుండా చంద్రబాబు శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. తరువాత విజయవాడలో వరదల సమయంలో సక్రమంగా పనిచేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రకాశం బ్యారేజీ గేట్లను పగులకొట్టేందుకు పడవలను పంపారంటూ హాస్యాస్పదమైన ఆరోపణలు చేశారు. ప్రతిసారీ ప్రజల దృష్టిని మళ్లించడానికి కూటమి ప్రభుత్వం చేయని తప్పంటూ లేదు. వైయస్ జగన్ కంటే పదిరెట్లు అధికంగా సంక్షేమాన్ని ఇస్తామని ప్రజలను నమ్మించి, 164 సీట్లు సాధించుకున్నారు. నేడు ఆ సంక్షేమం గురించి ప్రజలు ప్రశ్నిస్తుంటే, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. సూపర్ సిక్స్లో గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20వేలు, ఆడబిడ్డ నిధి కింద అర్హులైన మహిళలకు ఏడాదికి రూ.18000 ఇస్తామని మాట తప్పారు. యువతకు ఉద్యోగాలు, లేదా నిరుద్యోగభృతి అని, దానిని కూడా విస్మరించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన తప్పుడు ప్రచారం చేశారు. అదే కూటమి ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించారు. అంటే అంతకు ముందు వైయస్ జగన్ ప్రభుత్వంపై ఈ యాక్ట్ను అడ్డం పెట్టుకుని చేసినదంతా దుష్ప్రచారమేనని అంగీకరిస్తారా? గోదావరిలో ఇసుక దోపిడీ కనిపించడం లేదా? గోదావరినదీ గర్భంలో ఎనబై డ్రెజ్జర్లతో ఇసుకను తోడేస్తున్న వైనం కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా? దీనిపై నిత్యం టీడీపీకి వంతపాడే ఎల్లోమీడియాకు చెందిన ప్రతికలో భారీ కథనంను ప్రచురించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున డ్రెజ్జర్లు ఇసుకను తోడేస్తుంటే, అధికారులు నిద్రపోతున్నారా? ప్రభుత్వం కళ్లు మూసుకుందా? ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ జరుగుతోంది. గోదావరినదిలోని సహజ సంపదను కూటమి నేతలు దోపిడీ చేస్తున్నారు. పద్దెనిమిది రీచ్ల జరుగుతున్న ఈ తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు? బోట్స్మెన్ సొసైటీలకు మ్యాన్వల్ గా చేసుకునే పనుల ద్వారా లభించే ఉపాధిని కూడా ఈ డ్రెజ్జింగ్ రూపంలో దోచుకుంటోంది. అధికారుల మధ్యనే సమన్వయం లేదు. అధిక లోడ్లతో ఇసుక లారీలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు గత ప్రభుత్వంలో ఇసుక పాలసీలో జరిగిన దోపిడీపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతుందని ఎల్లో మీడియాలో ఒక కథనం ప్రచురించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో చేసిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, వైయస్ జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ.700 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం రూ.3500 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చేలా చేశారు. అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి దోపిడీగా కనిపిస్తోందా? నేడు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన ఆదాయానికి గండి కొడుతూ, కూటమి నేతల జేబుల్లోకి ఆ సొమ్ము వెళ్ళేలా చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే అప్పటి వరకు నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను వారం రోజుల్లోనే కూటమి నేతలు మాయం చేశారు. దీనిపై కనీస విచారణ అయినా చేశారా? నేడు ఇసుక, మట్టి పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. ఈ తప్పులను ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీ ఎత్తి చూపుతుండటంతో తట్టుకోలేక పోతున్నారు. మద్యంలో చంద్రబాబు భారీ అవినీతి కూటమి పాలనలో జరుగుతున్న మద్యం పాలసీలో భారీ అవినీతి చోటుచేసుకుంది. కూటమి పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మద్యం దుకాణాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నారు. గతంలో వైయస్ జగన్ పాలనలో 43వేల బెల్ట్షాప్లను పూర్తిగా నిర్మూలించారు. ప్రభుత్వ తరుఫున మద్యం విక్రయాలు చేయించారు. దీనివల్ల మద్యం విక్రయాలు తగ్గి, ఆదాయం పెరిగింది. కానీ కూటమి పాలనలో మద్యం విక్రయాలు పెరిగాయి, కానీ ఆదాయం మాత్రం తగ్గింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న హయంలో చేసిన మద్యం పాలసీ నిర్ణయాల వల్ల రూ.3 నుంచి 5వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సీఐడీ కేసు నమోదు చేసిందని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు.