కృష్ణా: అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్రలో నిజమైన రైతులెవరూ లేరని, కేవలం చంద్రబాబు మనుషులు మాత్రమే ఉన్నారని కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతి పాదయాత్ర అనేది టీడీపీ యాత్ర అని అన్నారు. చంద్రబాబు నేరుగా వస్తే ప్రజల్లో సానుభూతి రాదని.. అందుకే తన బినామీలతో చేయిస్తున్నాడన్నారు. టీడీపీ వాళ్లు కనీసం తమ పార్టీ కండువా కూడా కప్పుకొని స్వాగతం పలికే స్థితిలో లేరన్నారు. పచ్చ కండువా కప్పుకొని పాదయాత్రలో తిరుగుతున్నారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలందరినీ కొట్టి అమరావతిలో ఉన్న డబ్బున్నోళ్లకు పెట్టాలనది చంద్రబాబు ఉద్దేశమన్నారు. అమరావతి పాదయాత్రకు ప్రజాదరణ లేదు. కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొనట్లేదని చెప్పారు. ప్రతి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. పేదల ఆర్థిక స్థితిగతిని మార్చడమే వైయస్ జగన్ ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసలు రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ను మానసిక క్షోభ అనుభవించేలా చేశాడన్నారు. ఎన్టీఆర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, చివరిగా అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడతాను అంటే మార్షల్స్ను పెట్టి బయటకు గెంటించిన నీచ చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. మొదటి మహానాడులో ఎన్టీఆర్ ఫొటో లేకుండా చేశాడని, చనిపోయిన తర్వాత మాత్రం దండ వేసి ఎనలేని భక్తి చాటుకుంటున్నాడని అన్నారు.