వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం 

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

  విశాఖపట్నం: వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయ‌ప‌డ్డారు.  విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ సమావేశమైంది. ప్రొఫెసర్‌ లజపతిరాయ్‌ అధ్యక్షతన విశాఖపట్నంలో శనివారం ఉత్తరాంధ్ర మేధావులు భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్‌, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.., ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. 

విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి సహా కర్నూలు, విశాఖ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అవసరమైతే విశాఖ రాజధాని కోసం నా పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ.. విశాఖకు రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జేఏసీ ఆవిర్భవించింది. రాజకీయేతర జేఏసీలో ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాల భాగస్వామ్యం ఉంటుందని మంత్రి అమర్నాథ్‌ పేర్కొన్నారు.

 
విశాఖకు మద్దతుగా భారీ ర్యాలీ
అక్టోబర్ 15 న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో మండల, నియోజక వర్గ స్థాయిలో సమావేశాలు  ఏర్పాటు చేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది.

తాజా వీడియోలు

Back to Top