నెల్లూరు: పారదర్శకమైన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కాకాని గోవర్థన్రెడ్డి ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, ప్రజాధనాన్ని కాజేసేలా టీడీపీ కూటమి నేతలు పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైన్షాప్ల అప్లికేషన్లలో సిండికేట్ల రాజ్యం సాగుతోందని, ఏ ప్రాంతంలో, ఏ దుకాణానికి ఎవరు దరఖాస్తు చేయాలనేది వారే నిర్దేశిస్తున్నారని తెలిపారు. వైన్షాప్ల కేటాయింపునకు అప్పుడే కమిషన్లు మొదలు పెట్టారని, షాప్ల నిర్వహణకు వాటాల పేరుతో ప్రిట్యాక్స్ వసూలు చేస్తున్నారని, చివరకు ఎక్సైజ్ అధికారులనూ వదలకుండా బ్లాకమెయిల్ చేస్తున్నారని మాజీ మంత్రి చెప్పారు. నెల్లూరు క్యాంపు ఆఫీస్లో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైన్షాప్ల ఏర్పాటు విషయంలో నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణ, విశాఖకు చెందిన అనిత విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని, తమ అనుచరులను రంగంలోకి దింపి దుకాణాల కేటాయింపులకు కమిషన్లు, దుకాణాల్లో వాటాలు ఎంతెంత ఇవ్వాలన్నది నిర్దేశిస్తున్నారని కాకాణి ఆరోపించారు. దీనికి సంబంధించి బయటపడిన మంత్రి నారాయణ ఆడియోను ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్షాప్లకు కేవలం 16 వేల దరఖాస్తులు మాత్రమే వస్తే, ఎక్సైజ్శాఖ ఆ సంఖ్యను 39,259గా చూపుతోందని మాజీ మంత్రి చెప్పారు. 116 వైన్షాప్లకు ఒక అప్లికేషన్ మాత్రమే రాగా, 56 షాప్లకు అసలు దరఖాస్తులే రాలేదని, 256 షాప్లకు కేవలం రెండేసి అప్లికేషన్లు మాత్రమే వచ్చాయంటే, లిక్కర్ సిండికేట్ల దందా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలని అన్నారు. అనధికార లెక్కల ప్రకారం 2014–19 మ«ధ్య, అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.50 లక్షల కోట్లు మద్యం ద్వారా దోపిడి చేశారని ప్రస్తావించిన కాకాణి గోవర్థన్రెడ్డి, గతంలో ఉన్న 2934 షాప్లను ఇప్పుడు 3396 షాప్లకు పెంచి సరికొత్త దోపిడికి తెర తీశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.