సీఎం వైయస్ జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ భేటీ

రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ

రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలన్న సీఎం

సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌

ఆర్బీకేల ద్వారా రైతులు ఉత్పత్తుల కొనుగోలుకు ఓకే

విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామని వెల్ల‌డి

సీఎం దార్శినికత బాగుందన్న ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ క‌ళ్యాణ్ కృష్ణ‌మూర్తి

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డితో ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్ కృష్ణ‌మూర్తి, కంపెనీ అత్యున్నతాధికారుల బృందం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడ‌టం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి. రాష్ట్రంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓకు వివరించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్‌ కార్ట్‌ దోహదపడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలుచేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలన్నారు. 

ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు సీఎంయాప్‌ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని కూడా సీఎం కోరారు.  తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతులనుంచి ఉత్పతులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషిచేస్తామన్నారు. 

రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఈ–కామర్స్‌ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్‌కు పిలుపునిచ్చారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి ప్ర‌తిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ సానుకూలత వ్యక్తంచేశారు. విశాఖ‌లో ఇప్పటికే తమ సంస్థవ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామన్నారు. వచ్చే ఏడాదినుంచే  ఈ కార్యక్రమాలు మొదలవుతాయన్నారు.

మత్స్య ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సహాయపడాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కోరారు. ఇప్పటికే తమ భాగస్వామ్య సంస్థ వాల్‌మార్ట్‌ ద్వారా రాష్ట్రంలో మ‌త్స్య ఉత్పత్తుల కొనుగోలు, ఎగుమతి జరుగుతోందని, దీన్ని మరింతగా పెంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్ కృష్ణ‌మూర్తి తెలిపారు. సీఎం దార్శినికత బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు ఆయన అంకితభావంతో ఉన్నారన్నారు. తన ఆలోచనలన్నీ పంచుకున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసిన వారిలో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్ కృష్ణ‌మూర్తితో పాటు సీసీఏఓ రజనీష్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి సోలోమన్‌ ఆరోకియా రాజ్‌ పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top