విద్యుత్‌ చార్జీలు పెంచే ప్ర‌స‌క్తే లేదు

మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి 

అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకున్నాం

2019–20లో రూ.17,904 కోట్లు విడుదల 

విజ‌య‌వాడ‌: ఎన్ని ఇబ్బందులున్నా విద్యుత్‌ చార్జీలు మాత్రం పెంచబోమని, ప్రజల భాగస్వామ్యంతోనే విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతామని  మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కరోనా సంక్షోభంతో విద్యుత్‌ సంస్థలు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని సీఎం వైయ‌స్ జగన్ ఆదేశాలిచ్చార‌ని చెప్పారు. ఇందులో భాగంగానే విద్యుత్‌ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్‌సీకి సమర్పించాయ‌న్నారు.

డిస్కంల‌ను ఆదుకున్నాం..
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకున్నామ‌ని తెలిపారు. 2019-20లో రూ.17,904 కోట్లు విడుదల చేశాము, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్‌ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించామ‌ని చెప్పారు.  గృహ విద్యుత్‌ వినియోగదారులకు రూ.1,707 కోట్ల సబ్సిడీ ఇచ్చామ‌ని వివ‌రించారు. 

 గ్రామ, మున్సిపల్‌ వార్డు సచివాలయాల్లో 7,000 మందికి పైగా జూనియర్‌ లైన్‌మెన్లను ప్రభుత్వం నియమించటం వల్ల క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సంస్థల పనితీరు మెరుగుపడింద‌ని చెప్పారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలు నిర్వహించబోతున్నామ‌ని మంత్రి బాలినేని తెలిపారు.

Back to Top