తాడేపల్లి: పాదయాత్రలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారు. వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బటన్ నొక్కి పొదుపు మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వడ్డీ సొమ్మును జమా చేశారు.బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతలో డబ్బులు జమ అయ్యాయి. 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ చేశారు. కరోనా కష్ట కాలంలోనూ.. కరోనా కష్టకాలంలో..దేశమంతా లాక్డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క కరోనా వైరస్తో రాష్ట్ర ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. మరో పక్క కేంద్రం నుంచి వచ్చే నిధులూ తగ్గిపోయాయి. ఇంకో పక్క పేదలను ఆదుకోవడానికి ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీతో పాటు పేద కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు.