వైయస్ఆర్ జిల్లా : రెండు రోజుల వైయస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం లభించింది. కడప విమానాశ్రయంలో సీఎం వైయస్ జగన్కు జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్యే లు రవీంద్రనాధ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడే నాయకులు, ప్రజలను సీఎం వైయస్ జగన్ కలిసి.. సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. బుధవారం రాత్రి ఇడుపులపాయ గెస్ట్హౌస్లో సీఎం వైయస్ జగన్ బస చేస్తారు. గురువారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఉదయం 9.35 గంటలకు వైయస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం వైయస్ జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తరువాత పార్టీ నాయకులతో మాట్లాడి.. అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.