తాడేపల్లి: పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా పులివెందులలో చేపడుతున్న విద్య, వైద్య సంస్థలు, ఇరిగేషన్ పనులపై సీఎం సమీక్షించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ పనులపై, కేన్సర్ ఆస్పత్రి, ఇతర అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అదే విధంగా ఇటీవల వైయస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా శంకుస్థాపనలు చేసిన పనుల పురోగతి, ఇతర అంశాలను సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఈసారి వరద వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి ప్రాజెక్టులు తప్పనిసరిగా నిండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ముద్దనూరు – కొడికొండ చెక్పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులపై దృష్టిపెట్టాలని సూచించారు. గ్రామాల వారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్ స్టోరేజ్లు, పార్లమెంట్ల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లపై మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ ఒకే తరహా నమూనాలో ఉండాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు. పులివెందులలో ప్రపంచస్థాయి నాణ్యత స్కూల్ ఏర్పాటుపై, టౌన్ హాల్ నిర్మాణంపై దృష్టిపెట్టాలన్నారు.
ఖర్జూరం పెంపకంపై కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారని సీఎం వైయస్ జగన్కు అధికారులు తెలిపారు. వాతావరణం, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. చిరు ధాన్యాలను బాగా ప్రమోట్ చేయాలన్నారు. ఏపీ క్లార్లో ఉన్న మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచంచారు. వెటర్నరీ, హార్టికల్చర్ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేయాలని, వారం రోజుల్లో దీనిపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.