ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా జాప్యం చేయకూడదు

జూన్‌ 1 నుంచి వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలి

మంత్రులు, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి:  జూన్‌ 1వ తేదీ నుంచి వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదని సూచించారు. ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోవిడ్‌ సమయంలో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోకి వస్తుందని, అదే విధంగా  కార్మికులకు పని దొరుకుతుందని, స్టీల్, సిమెంట్, ఇతర మెటీరియల్‌ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయన్నారు. ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్‌ అన్నది చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్‌ అంతా భూగర్భ కేబుల్స్‌ వ్యవస్థే ఉంటుంది కాబట్టి.. నీటి పైప్‌లు, విద్యుత్, ఇంటర్నెట్‌ కేబుళ్లన్నీ అండర్‌గ్రౌండ్‌ నుంచి తీయాలని, ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ సిద్ధం చేసి.. పనులన్నీ ఒకే ఏజెన్సీకి ఇవ్వాలని ఆదేశించారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరైన మంత్రులు పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, çహౌసింగ్‌ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఫైనాన్స్‌ స్పెషల్‌ సీఎస్‌ కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌. శ్రీధర్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌గుప్తా, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top