తాడేపల్లి: ప్రజలకు శుద్ధమైన తాగునీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. వాటర్ గ్రిడ్పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు పలు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. వాటర్ గ్రిడ్ పథకం మూడు దశల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటా వర్తింపజేయాలన్నారు. తొలి దశలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి వసతి. రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలో శుభ్రమైన తాగునీరు. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటిని తీసుకున్న చోటే శుద్ధి చేసి సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిపై అధ్యయనం చేసి ప్రణాళిక ఖరారు చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు. తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పరిగణలోకి తీసుకోలని, కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి నేరుగా ఇళ్లకే తాగునీటిని సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.