పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు

ఉన్నత విద్యలో, కోర్సుల్లో చాలా మార్పులు తీసుకువచ్చాం

మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ నిరంతరం కొనసాగాలి

వర్సిటీల్లో టీచింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదు

ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీపడొద్దు

ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండాలి

విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: ‘‘చదువుకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు. నాణ్యమైన విద్య అందించడానికి అనేక చర్యలు తీసుకున్నాం. మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారుతాయి’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో, కోర్సుల్లో కూడా చాలా మార్పులు తీసుకువచ్చామని గుర్తుచేశారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌చేయాలని, అప్పుడు ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఉన్నత విద్యపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
విశ్వవిద్యాలయాల్లో టీచింగ్‌ స్టాప్‌ను పూర్తిగా భర్తీ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపాం. టీచింగ్‌ స్టాఫ్‌ లేనప్పుడు యూనివర్సిటీలు ఉన్నా.. లాభం ఏమిటి? మంచి అర్హతా ప్రమాణాలు కలిగినవారిని నియమించాలి. క్వాలిటీ లేకపోతే.. రిక్రూట్‌ చేసినా అర్ధం ఉండదు. నియామకాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి. రిక్రూట్‌మెంట్‌లో పక్షపాతాలకు తావుండకూడదు. కరిక్యులమ్‌లో కూడా మార్పులు రావాలి. అప్పుడే నాణ్యమైన విద్య అందించగలుగుతాం. విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఈ మూడు అంశాల్లో మార్పు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి.

పిల్లలకిచ్చే ఆస్తి నాణ్యమైన విద్య
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు. అదీ నాణ్యతతో కూడిన విద్య మాత్రమే. మనం వచ్చిన తర్వాత విద్యారంగంలో తేడా ఏంటి అన్నది కనిపించాలి. ఈ ప్రభుత్వం చదువుకు ఇచ్చిన ప్రాధాన్యత మరే ప్రభుత్వమూ ఇవ్వలేదు. నాణ్యమైన విద్య అందించడానికి అనేక చర్యలు తీసుకున్నాం. మంచి చదువులతో కుటుంబాల తలరాతలు మారుతాయి. 

జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్ధుల్లో ఆప్షన్‌గా ఎంపిన చేసుకున్న వారికి ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నామని తెలిపిన అధికారులు. 1,10,779 మంది ల్యాప్‌టాప్‌లను ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నారని తెలిపిన అధికారులు.

కాలేజీల్లో ప్రమాణాలు తప్పనిసరి..
యూనివర్సిటీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం పూర్తిస్ధాయిలో ఉండేలా చూసుకోవాలి. మంచి బ్యాండ్‌ విడ్త్‌ క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి. ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ పడొద్దు. ప్రతి కాలేజీ కచ్చితంగా ప్రమాణాలు పాటించాల్సిందే. కాలేజీలు సరిగ్గా లేకపోతే.. యూనివర్సిటీల ప్రతిష్ట దెబ్బతింటుంది. ఏ కాలేజీలోనైనా ప్రమాణాలు లేకపోతే.. గుర్తించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి.. మెరుగుపరుచుకోవడానికి సమయం ఇవ్వండి. ప్రమాణాలు లేనివాటికి అనుమతులు ఇవ్వొద్దు.

గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ లాంటి వ్యవస్ధలు సమర్థ‌వంతంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్సిటీలు అధ్యయనం చేయాలి. అలాగే సబ్‌రిజిస్ట్రార్, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపైన అధ్యయనం చేయాలి. యూనివర్సిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను రికార్డ్‌ చేయాలి. సబ్జెక్టుల వారీగా ఇలా రికార్డ్‌ చేసి, ఆన్‌లైన్ల్‌ పెట్టాలి. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి. ప్రతి వీసీ కూడా తన హయాంలో మంచి మార్పులు తీసుకురావాలి. ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలి. మైక్రోసాప్ట్‌ లాంటి సంస్ధలతో శిక్షణ నిరంతరం కొనసాగాలి. కోర్సులలో శిక్షణను ఇంటిగ్రేట్‌ చేయాలి. అప్పుడే ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చాం. జాబ్‌ ఓరియెంటెడ్‌గా మన కోర్సులను తీర్చిదిద్దాలి. విద్యార్థి విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా ఉద్యోగం సాధించేలా ఉండాలి. మంచి చదువులున్నా ఇంటర్వూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అప్రెంటిస్‌షిప్‌ కచ్చితంగా ఉండాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకువస్తున్నాం. జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను, కాలేజీలను అనుసంధానం చేయాలి. 

అత్యుత్తమ కరిక్యులమ్‌..
సర్టిఫైడ్‌ కోర్సులనూ కరిక్యులమ్‌లో భాగంగా చేయాలి. ఉగ్యోగాల కల్పన, ఉపాధి అన్నది లక్ష్యం కావాలి. ఆయా రంగాల్లో నిపుణులైన, అత్యుత్తమమైన వ్యక్తులతో కోర్సులను రూపొందించండి. బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టాలి. నాలుగేళ్లపాటు ఇంగ్లిషు, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలి. చదువులు అయిపోయిన తర్వాత కచ్చితంగా జాబ్‌ వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రాక్టికాలిటీకి పెద్ద పీట వేయాలి. 
 
జాతీయ స్ధాయి ప్రమాణాలు 
జీఈఆర్‌ రేషియోను 2025 నాటికల్లా 70 శాతం అందుకోవాలి. విద్యాదీవెన, వసతి దీవెనలాంటి పథకాలతో కచ్చితంగా దీన్ని అందుకుంటాం. ఆస్పత్రులను జాతీయ స్ధాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం. అలాగే ప్రతి యూనివర్శిటీ పరిధిలో కూడా జాతీయ ప్రమాణాలు ఉండాలి. కాలేజీలన్నీ ఆయా ప్రమాణాలు పాటించేలా చూడాలి. దీనికోసం సరైన లక్ష్యాలను నిర్దేశించండి. దీనికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి. 

సమస్యలున్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్
ఎన్ని సమస్యలున్నా సరే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఎక్కడా లోటు చేయడం లేదు. ప్రతి మూడు నెలలకొకసారి కచ్చితంగా చెల్లింపులు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడం వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నాం. 
తల్లుల అక్కౌంట్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నాం. కాలేజీల్లో పరిస్థితులపై నేరుగా వారు ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఇతర ప్రయివేటు కాలేజీల్లానే సమానంగా ఫీజులు చెల్లిస్తాం. దీనివల్ల ఆర్ధికంగా యూనివర్సిటీలు స్వయం సమృద్ధి సాధిస్తాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చాం. 

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను తీసుకువస్తున్నాం. ఆ కాలేజీలను స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. పరిశోధనల మీద కూడా కొలాబరేట్‌ చేసుకోవాలి. జిల్లాల్లో పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలి. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రంగానికి సంబంధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కొలాబరేట్‌ కావాలి. 

యూనివర్సిటీలు - మూడేళ్ల కార్యాచరణ
ప్రతివారం ఒక వీసీతో సమావేశం కావాలి. యూనివర్సిటీల్లో సమస్యలు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై కలిసి కూర్చుని చర్చించాలి. ఆ సమావేశంలో గుర్తించిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలి. ఇలా రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ వీసీతో కలసి విడివిడిగా సమావేశాలు నిర్వహించాలి. ప్ర‌స్తుతం ఉన్న స్ధాయి, మెరుగుపర్చుకోవాల్సిన ప్రమాణాలను గుర్తించాలి. తర్వాత యూనివర్సిటీల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వ‌చ్చే మూడేళ్ల కాలానికి కార్యాచరణ రూపొందించాలి. మూడేళ్లలో ఈ విజన్‌ అందుకోవాలి. అన్ని యూనివర్సిటీల్లో నాక్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కావాలి. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను యూనివర్సిటీలతో ఇంటిగ్రేట్‌ చేయాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా పేరున్న కంపెనీలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఆన్‌లైన్‌లో కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఉంచాలి. ఇంగ్లిషును మెరుగుపర్చడంపైనా దృష్టిపెట్టాలి. బేసిక్‌ ఇంగ్లిషు అన్నది తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలి. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.

డిగ్రీ కళాశాలలుపైనా సీఎం సమీక్ష
డిగ్రీ కళాశాలను కూడా ఒక విధానం ప్రకారం ఏర్పాటు చేయాలి
ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక డిగ్రీ కళాశాల ఉండాలి

ఎలాంటి అభ్యంతరం లేదు
ఎయిడెడ్‌  విద్యాసంస్ధల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందం. చాలా విద్యాసంస్థ‌ల్లో పరిస్థితులు దెబ్బతిన్నాయి. శిధిలావస్థ‌లో, మౌలికసదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి ఒక అవకాశం ప్రభుత్వ పరంగా కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే.. ఆయా సంస్థ‌లను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మెరుగైన రీతిలో వాటిని నడుపుతుంది. దాతల పేర్లు కూడా కొనసాగుతాయి. లేదు తామే నడుపుకుంటామంటే భేషుగ్గా నడుపుకోవచ్చు. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వానికి ఎయిడెడ్‌ విద్యాసంస్ధల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలి.

సమీక్ష సమావేశంలో భాగంగా ఇంగ్లిషు కమ్యూనికేషన్‌ వర్క్‌బుక్,  టెక్ట్స్‌బుక్స్‌తో పాటు, ఏపీఎస్‌సీహెచ్‌ఈ పాడ్‌కాస్ట్‌ను సీఎం వైయస్‌.జగన్‌ ఆవిష్కరించారు. 

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top