రైతుల ఆదాయం రెట్టింపవ్వాలి

ఈమార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుపై దృష్టిసారించాలి

గోదాముల వద్దే జనతా బజార్ల ఏర్పాటుపై నివేదిక సిద్ధం చేయాలి

ఆర్బీకేల్లో క్వాలిటీ మెటీరియల్, సీడ్స్, ఫెర్టిలైజర్స్‌ ఉండాలి

వచ్చే 30 ఏళ్ల వరకు రైతులకు విద్యుత్‌ సమస్య ఉండదు

అధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆర్బీకేల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష

తాడేపల్లి: రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా ఈమార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రావాలని, ప్లా్లట్‌ఫామ్‌ ఏర్పాటుపై మరింత దృష్టిసారించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. అదే విధంగా అగ్రికల్చర్, హర్టికల్చర్, డైరీ, ఆక్వా రంగాల్లో ఫార్మ్‌గేట్‌ మౌలిక సదుపాయాలపైనా సమీక్షించారు. రూ.6 వేల కోట్లతో మల్టీపర్పస్‌ ఫెసిలిటీస్‌ ఏర్పాటుపై సమీక్షలో చర్చించారు. గోదాముల వద్దే జనతా బజార్లు ఏర్పాటుపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పీఏసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలించి చర్యలు తీసుకోవాలని, ఈ అంశంపై ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలను బలోపేతం చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాన్నారు. క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ సీడ్స్, క్వాలిటీ ఫెర్టిలైజర్స్‌ ఉండాలన్నారు. ఈ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో రైతులు ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా ఈమార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రావాలన్నారు. ఈ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుపై మరింత దృష్టిపెట్టాలని, వచ్చే ఖరీఫ్‌ నాటికి ఈమార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

‘‘రైతు తన పంటను అమ్ముకోవాలంటే జనతా బజార్లు అందుబాటులోకి రావాలి. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలి, మరోవైపు పంటకు గిట్టుబాటు ధర రావాలి. గోదాముల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలి.. ఎప్పుడు పూర్తి చేయాలి.. బడ్జెట్‌ నిధులు వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆసరా, చేయూత పథకాలు మెజార్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. 

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ఇవ్వాలంటే మీటర్లు ఉండాలి. అప్పుడే ఫీడర్లపై భారం ఎంతో కూడా తెలుస్తుంది. ప్రభుత్వమే నేరుగా రైతు అకౌంట్‌లో డబ్బు జమ చేస్తుంది. అందువల్ల ఎక్కడా రైతుకు విద్యుత్‌ బిల్లుల సమస్య ఉండదు. వచ్చే 30 ఏళ్ల వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు’’. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్, మార్కెటింగ్‌ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ పిఎస్‌ ప్రద్యుమ్న, అగ్రికల్చర్‌ స్పెషల్‌ కమిషనర్‌ అరుణ్‌కుమార్, నాబార్డు సీజీఎం ఎస్‌కే జన్నావర్‌తో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

Back to Top