అనంతపురం జిల్లా: పేదల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సింగనమల నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్ పాల్గొని వైయస్ఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకుండా అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తోందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు గ్రామ కమిటీలను బలంగా పనిచేయించుకోవాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.