తాడేపల్లి: విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్, బ్రాండెక్స్లో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. అధికారుల నుంచి వివరాలు కోరారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అచ్యుతాపురం ఘటనకు దారితీసిన కారణాలను సీఎం వైయస్ జగన్కు సీఎంవో అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని ఆదేశించామని, గ్యాస్ లీక్ను కూడా నియంత్రించారని ముఖ్యమంత్రికి సీఎంవో అధికారులు తెలిపారు. బ్రాండిక్స్లో ఒక యూనిట్లో పనిచేస్తున్న మహిళలను అందర్నీ ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని తెలిపారు. అమ్మోనియా ఎక్కడనుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ను సీఎం ఆదేశించారు.