సోమన్న డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవ్వడం సంతోషంగా ఉంది

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అసెంబ్లీ: ‘సోమన్న అని నేను ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికై.. ఆ చైర్‌లో కూర్చోవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

‘‘రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి కోలగట్ల వీరభద్రస్వామి అడుగుపెట్టారు. మొట్టమొదటిసారిగా 2004లో శాసనసభకు ఎన్నికవ్వడం.. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా ఆ స్థానం కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. 

అంతకుముందు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతి చేసిన మంచి కూడా సభ ద్వారా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. రఘుపతి మూడు సంవత్సరాలు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఇంకో సామాజిక వర్గానికి కూడా స్థానం ఇవ్వాలని చర్చించినప్పుడు మనస్ఫూర్తిగా మంచి నిర్ణయం అని అంగీకరించాడు. వీలైనంత ఎక్కువ మందికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చాలా మంచిది అని చిరునవ్వుతోనే స్వాగతించాడు. డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి చట్టసభలో అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top