వెంకటాయపాలెం: పేదల కోసం న్యాయ పోరాటం చేశాం.. విజయం సాధించాం.. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం.. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గర్వంగా చెప్పారు. దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయమని సీఎం వైయస్ జగన్ అభివర్ణించారు. ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:
మండే ఎండలను సైతం లెక్కచేయకుండా...
ఈ అద్భుతమైన కార్యక్రమానికి రోహిణి కార్తిలో మండేఎండలను కూడా లెక్కచేయకుండా మనసు నిండా మమకారంతో, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచిపెడుతున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు.
పేదల కోసం ప్రభుత్వమే న్యాయపోరాటం చేసిన సందర్భం.
ఈ రోజు ఈ సభకు, ఈ సందర్భానికి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని, ఇళ్లు ఇవ్వాలని జరిగిన వందలు, వేల పోరాటాలను మనం చూశాం. 75 ఏళ్ల స్వతంత్య్ర భారత చరిత్రలో ఇటువంటి పోరాటాలు మనం చాలా చూశాం. కానీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తామని సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, సుప్రీంకోర్టు దాకా వెళ్లిమరీ 50వేల కుటుంబాలకు ఇళ్లపట్టాలిస్తున్న ఈ పండుగ, ఈ చారిత్రాక ఘట్టాన్ని ఈ రోజు అమరావతిలో చూస్తున్నాం.
ఇళ్లపట్టాలివ్వాలని ప్రభుత్వం తాపత్రయపడుతుంటే.. దాన్ని అడ్డుకునేందుకు మారీచులు, రాక్షసులు ఏకంగా సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదని ఆరాటపడుతున్న పరిస్థితులు ఒకవైపు, కాదు కచ్చితంగా పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని ఆరాటపడుతున్న ప్రభుత్వ తాపత్రయం ఇటువైపు. బహుశా ఇటువంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు.
50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ...
ఈ రోజు 50,793 మంది అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరుమీద ఇళ్ల స్ధలాలు రిజిష్ట్రేషన్ చేసి ఇస్తున్న గొప్ప సందర్భం. నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసే ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను.
ఇళ్ల పట్టాలు – సామాజిక న్యాయ పత్రాలు..
ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, మంత్రి సురేష్ను.. ఈ ప్రాంతంలో గజం రేటు ఉజ్జాయింపుగా ఎంత ఉంటుందని అడిగాను. ఈ మధ్య కాలంలో వేలం జరిగింది. అందులో గజం రేటు రూ.17వేలకు అమ్ముడుపోయింది. కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో గజం ధర ఉంటుంది. అంటే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇంటి స్ధలం నా పేద అక్కచెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్ జరగబోతుంది. పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్ల స్ధలాల పత్రాలు వారికిస్తున్న హక్కులు కావు. వారికిస్తున్న సామాజిక న్యాయపత్రాలు కూడా.

ఇకపై సామాజిక అమరావతి...
ఇదే అమరావతి ఇక మీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది. ఇకపై మనందరి అమరావతి అవుతుంది. మనదైన మంగళిగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1400 ఎకరాలలో 50,793 మంది నా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్ధలాలు అందజేసే కార్యక్రమం 25 లేఅవుట్లలో జరుగుతుంది.
మరో వారం రోజుల పాటు ఈ పండగ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి లేఅవుట్దగ్గరకి వెళ్లి, ప్రతి అక్కచెల్లెమ్మను అక్కడకు తీసుకెళ్లి, ఇళ్లపత్రాలు ఇచ్చి, ఆ ఇంటి స్ధలంలో ఫోటో తీసుకుని, జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత ఇళ్లు కట్టించే కార్యక్రమానికి కూడా బీజం పడుతుంది.
జూలై 8 నుంచి ఇళ్ల నిర్మాణం...
ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంతో పాటు... జూలై 8వ తేదీన అంటే నాన్నగారి జయంతి రోజున ఇళ్లు కూడా మంజూరు చేసి కట్టించే కార్యక్రమం మొదలుపెడతాం. ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్ పూర్తి చేసి, ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 232 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. నా అక్కచెల్లెమ్మల పేరుమీద ఈ ఇళ్లపట్టాలన్నీ ఇస్తాం. వారం రోజుల్లో ఇది పూర్తవుతుంది.
ఇళ్ల నిర్మాణం – మూడు ఆప్షన్లు...
అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇస్తాం.
మొదటి ఆప్షన్ సొంతంగా తామే కట్టుకుంటామంటే.. ఆ పనుల పురోగతి మేరకు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.8లక్షలు బ్యాంకుల ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్గా వారి ఇంటి నిర్మాణ పనుల కోసం వారికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణకూలి మొత్తాన్ని పనుల పురోగతిమేరకు వారి ఖాతాల్లోకి నేరుగా జమచేస్తాం. ఇవన్నీ మేం చేసుకోలేం అన్నవాళ్లకి మూడో ఆప్షన్ కూడా ఇస్తున్నాం.
ఆప్షన్ –3గా ప్రభుత్వమే కట్టించాలని అడిగితే.. చిరునవ్వుతో స్వీకరించి.. ఆ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది.
ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్ తీసుకున్నా.. పర్వాలేదు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక పూర్తిగా అందజేయడం జరుగుతుంది. ఈ ఇళ్లకు కూడా మిగిలిన చోట్ల చేస్తున్నట్టే... ఈ ఇంటికి సంబంధించిన ఇసుక పూర్తిగా ఉచితంగా అందేస్తాం. సిమెంటు, స్టీల్, డోర్ ఫ్రేములు అన్నీ కూడా తక్కువ రేటుకే అందరికీ అందించడం జరుగుతుంది. మార్కెట్లో రేట్లకన్నా.. తక్కువ రేట్లకు ప్రభుత్వం అందిస్తుంది. నాణ్యత విషయలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడ్డంలేదు. దీంతో పాటు రూ.35వేలు చొప్పున రుణాలు లబ్ధిదారులకు బ్యాంకులనుంచి ఇప్పిస్తున్నాం. పావలావడ్డీకే ఈ రుణాలు ఇప్పిస్తున్నాం. దీనివల్ల ఇళ్ల కట్టే కార్యక్రమం వేగవంతం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్ధలాలు, ఇంటి నిర్మాణం గురించి చూస్తే.. .మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల స్ధలాలు ఇచ్చాం. వీరిలో 21లక్షల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు చెపుతున్నా... 30.75 లక్షల ఇంటి స్ధలాలు అందులో దాదాపు రూ.2.50 లక్షల విలువ చేసే ఇళ్లు. ఇల్లు పూర్తైన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉంటుంది. అంటే రూ.2–3 లక్షల కోట్లు మీ అన్నగా, మీ బిడ్డగా.. అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాను. గతంలో ఇలాంటి ఆలోచనలుచేసే సాహసమైనా కూడా గత ప్రభుత్వం పాలకుల్లో ఎప్పుడైనా చూశారా?
గతానికీ ఇప్పటికీ మధ్య తేడా ఎంతుందో గమనించండి.

సీఆర్డీయే పరిధిలో 5,024 మందికి టిడ్కో ఇళ్లు....
ఈ 50 వేల ఇళ్ల స్ధలాల పంపిణీతో పాటు ఈ రోజు ఇక్కడ మరో మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇదే ప్రాంతంలో మరో 8 చోట్ల జగనన్న కాలనీలలో టిడ్కో ఇళ్లు, పీఎంఏవై కింది జీ ప్లస్ 3 విధానంలో సీఆర్డీయే పరిధిలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం. వారం రోజుల్లో వారితో కూడా గృహప్రవేశాలు చేయించి, వాళ్లకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా అందిస్తాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం విలువ రూ.443 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ప్లాట్పై రూ.1.50 లక్షలు చొప్పున సబ్సిడీ రూపేణా వాళ్లు ఇచ్చింది రూ.75 కోట్లు అయితే.. మనసున్న ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా, మన బాధ్యతగా ఈ 5024 ప్లాట్ల మీద మన ప్రభుత్వం మరో రూ.251 కోట్లు ఖర్చు చేసింది. టిడ్కో ఇళ్ల గురించి కూడా మీకు కాస్త వివరంగా చెప్పాలి.
టిడ్కో ఇళ్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక్కోసారి చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన మాటలు వస్తుంటాయి. అయ్యా మీరు టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే.. వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్కు నాలుగేళ్లు ఎందుకు పడుతుంది ? అని చంద్రబాబునాయుడుని అడుగుతున్నాను.
మీ అందరికీ మరో మాట కూడా చెప్పాలి. 300 చదరపు అడుగులు ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ అడుగుకి దాదాపు రూ.2వేలు వేసుకుంటే... దాదాపుగా రూ.5.75లక్షలు అవుతోంది. మౌలిక సదుపాయాలకోసం రూ.1 లక్ష అవుతుంది. అంటే రూ.6.65 లక్షలు ఖర్చయ్యే ప్లాట్లో... కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో లక్షన్నర ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తే.. మిగిలిన రూ.3లక్షల డబ్బును బ్యాంకులనుంచి అప్పుగా తీసుకుని 20 ఏళ్లపాటు ఆ పేదవాడు ప్రతి నెలా రూ.3వేలు చొప్పున కట్టుకుంటూ పోవాలి. 20 ఏళ్లలో పేదవాడి మీద పడే అప్పు వడ్డీతో తడిసి మోపుడై మొత్తంగా రూ.7.2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? చంద్రబాబునాయుడు అబద్దాలు చెప్పినట్టు ఇది నిజంగా పేదవాడికి ఇచ్చినట్టేనా ?

కానీ మీ బిడ్డ ఏం చేసాడంటే...
ప్రతి అక్కచెల్లెమ్మ పేరు మీద ఈ ప్లాట్ రాసిచ్చి... ఈ ప్లాట్ మీ అన్న మీకు రూ.1కే ఇస్తున్నాడని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాడు. కాని చంద్రబాబు, వారి గజ దొంగల ముఠాకు, ఎల్లోమీడియా వక్రభాష్యాలు చెప్తూనే ఉంది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ కొన్ని విషయాలు తెలిసి ఉండాలి.
తన పాలనలో సెంటు భూమి కూడా ఇవ్వని బాబు...
చంద్రబాబు తన పాలనలో ఏ ఒక్కపేదవాడికి కూడా కనీసం ఒక్క సెంటు భూమి, కనీసం ఒక ఇళ్ల పట్టా ఇచ్చిన పాపానపోలేదు.
ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, రైతులను, అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులతో సహా అందర్నీ మోసం చేశాడు.
ఇలాంటి చంద్రబాబు గురించి ఎందుకు చెప్తున్నానంటే.. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. నా ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలు, బీసీలు మైనార్టీలంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. సామాజిక వర్గాల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో అని అంటాడు.

నరకాసురుడినైనా నమ్మండి – నారా బాబుని మాత్రం నమ్మకండి.
మీరు గుర్తుంచుకొండి. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చేమో కాని, నారా చంద్రబాబునాయుడిని మాత్రం నమ్మొద్దు.
2014 –2019 వరకూ ఒక ఇళ్లపట్టా, సెంటు భూమి కూడా చంద్రబాబునాయుడు గారి హయాంలో ఇవ్వలేదు.
మా కష్టం కన్నా - మీ కష్టం ఎక్కువని భావించాం
మీ బిడ్డ ప్రభుత్వంలో కోవిడ్ కష్టాలు చూశాం. కోవిడ్ కష్టాలు రెండేళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా కూడా... మీ బిడ్డ మాత్రం.. మాకున్న కష్టంకన్నా.. మీ కష్టమే ఎక్కువ అని భావించి మీ బిడ్డ పరిగెట్టాడు. కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్లపట్టాలు సేకరించి ఇచ్చాం. ఆర్థికంగా ఎన్ని సవాళ్లైనా వచ్చినా సరే.. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాం. మేనిఫెస్టోలో 98శాతం వాగ్దానాలను అమలు చేశాం. ఇళ్ల స్ధలాల పంపిణీలో మరో రెండడుగులు ముందుకు వేసి... ఇళ్ల నిర్మాణాలను దశలవారీగా చేపడుతూ పరిగెట్టిస్తున్నాం.

నాలుగేళ్ల అవినీతి రహిత పాలన...
ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి, లంచం, వివక్ష లేదు. ఇవేవీ లేకుండానే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కగానే ఆ డబ్బులు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ డీబీటీకి నాన్ డీబీటీ కూడా తీసుకుంటే.. ఇందులో ఇంటి స్ధలాల విలువే చూసుకుంటే ఒక్కో ఇంటి స్ధలం విలువ రూ.2.50 లక్షలు చొప్పున 30 లక్షల ఇళ్లు విలువ రూ.75 వేల కోట్లు అవుతుంది. ఇక మిగిలిన గోరుముద్ద, సంపూర్ణపోషణం వంటివి కలుపుకుంటే అక్షరాలా రూ.3 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చేర్చాం.
మంచి జరుగుతుంటే తట్టుకోలేక...
ఇంత మంచి జరుగుతుంటే తట్టుకోలేని దుష్టచతుష్టయం, ఈ గజదొంగల ముఠా అంటే ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరందరికీ, ఒక దత్తపుత్రుడు, వీరంతా గజ దొంగల ముఠా. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం ఇదీ ఆ 5 సంవత్సరాల చంద్రబాబు పాలనలో మనం చూశాం. అప్పుడూ ఇదే రాష్ట్రం, ఇప్పుడూ ఇదే రాష్ట్రం. ఇదే బడ్జెట్.అప్పులు కూడా చూస్తే... అప్పటి కన్నా ఇప్పుడే మీ బిడ్డ హాయాంలోనే తక్కువ. అప్పుల గ్రోత్ రేట్ అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. మరి ఇన్ని లక్షల కోట్లు లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి మీ బిడ్డ హయాంలో ఎలా పోతుంది, ఎలా జరుగుతుంది. మరి చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదన్నది ఆలోచన చేయండి ?
వారికి మంచి చేసే ఉద్దేశం లేదు. పేదవాడికి మంచి జరగాలని ఆరాటం లేదు. వారి తపన, తాపత్రయం, వారి దృష్టిలో అధికారంలోకి రావడం ఎందుకు అంటే... దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే.
వారి దారుణాలను ఎవరూ రాయరు, చూపరు. ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ.
క్లాస్ వార్ జరుగుతుంది...
ఈ రోజు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడంలేదు. ఇక్కడ జరుగుతున్నది క్లాస్ వార్.
ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపు పేదవాళ్లకు మంచి జరగకూడదని పెత్తందార్లు అంతా ఏకమై యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. ఇదే అమరావతిలో అయితే పేదవాడికి ఇళ్ల స్ధలాలివ్వంటే ఏకంగా కోర్టులకు వెళ్లి.. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే... పెత్తందార్లు జీర్ణించుకోలేక ఏకంగా హైకోర్టులో కేసులు వేసి, అక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టు కోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీం కోర్టులో ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ, నిన్న కూడా మీకు ఇళ్ల స్ధలాలిస్తామంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు రకరకాలుగా అడ్డుకుంటున్నారు.

పేదలు ఎదగాలని....
పేదవాడు చదవాలి, ఎదగాలి అని మనం తాపత్రయపడితే గవర్నమెంటుబడులలో ఇంగ్లిషు మీడియం ఉండడానికే వీలు లేదని అడ్డుకునే కార్యక్రమం చేసారు. ప్రతి అడుగులోనూ పేదవాడికి అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నా అక్కచెల్లెమ్మలకు మీ జగన్ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఆ అమ్మఒడి, ఆసరా, చేయూత వల్ల నా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. వాళ్ల పిల్లలను గొప్పగా చదివించగలుగుతున్నారు.
ఇటువంటివన్నీ మీ బిడ్డ చేస్తుంటే...
దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఈనాడు, ఆంధ్ర జ్యోతిలో రాస్తారు. వాళ్ల టీవీలలో డిబేట్లు పెడతారు.
రాబోయో రోజుల్లో ఇంకా మంచి జరిగే పరిస్థితులు,మంచి చేసే పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాను. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరుగుతుండగానే.. మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం.. జూలై 8న ఇళ్లు కట్టించే కార్యక్రమం నాన్నగారి జయంతి రోజున ప్రారంభమవుతుంది. ఈ 50 వేలమంది అక్కచెల్లెమ్మలకు, 25 కాలనీల్లో... ప్రతికాలనీలో అంగన్వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు కూడా రాబోతున్నాయి. ఇక్కడే ఉన్న నవులూరిలోని లేక్ను కూడా అభివృద్ధి చేస్తున్నాం అని సీఎం తన ప్రసంగం ముగించారు.