కురుపాం: పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని క్షమించగలమా? అని ప్రశ్నించారు. పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులని తీర్చిదిద్దాం. ప్రైవేట్ బడులతో ప్రభుత్వ బడులు పోటీపడే పరిస్థితికి చేరుకుంది. చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదు.. దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డకు మీరే అండ. మీ బిడ్డకు అండగా ఉన్నది ఆ భగవంతుడు.. ప్రజలు మాత్రమే. మీకు మంచి చేశాను అనిపిస్తేనే ఈ యుద్ధంలో మీరే నాకు అండగా నిలవాలని సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా ..కురుపాం బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...: గుండెల్లో పెట్టుకున్న గిరిపుత్రులకు కృతజ్ఞతలు నన్ను గుండెల్లో పెట్టుకున్న గిరిపుత్రులకు, అభిమానం, చిక్కటి చిరునవ్వులతో ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వాతాతలకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికీ, చిట్టితల్లులు, చిట్టి పిల్లలకూ హృదయపూర్వక కృతజ్ఞతలు. మన పిల్లలు ప్రపంచాన్ని ఏలాలన్న సంకల్పంతో.. ఏ తల్లైనా, తండ్రి అయినా తమ పిల్లలకు తమ కంటే గొప్పగా ఉండాలని, తాను పడిన కష్టాలు, ఆ పరిస్థితులు తమ పిల్లలకు రాకూడదని ఏ తల్లి,తండ్రైనా కోరుకుంటారు. వచ్చే తరం మనకంటే బాగుండాలనే కాకుండా ప్రపంచంలో పోటీని, ఆ సవాళ్లను మన బిడ్డలు తట్టుకుని నిలబడాలని, ప్రపంచాన్నే ఏలే పరిస్థితుల్లోకి మన పిల్లలు రావాలన్న గట్టి సంకల్పంతో మన ప్రభుత్వం నాలుగేళ్లుగా అడుగులు ముందుకు వేసింది. అందులో భాగంగానే ఈ రోజు అమ్మఒడి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాం. పది రోజుల పాటు ప్రతిమండలంలోనూ పండగ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ పాలుపంచుకుంటారు. ఆ అక్కచెల్లెమ్మలు, పిల్లలతో పాటు వాళ్లూ కూడా ఆ సంతోషంలో భాగస్వామ్యులవుతారు. తమ పిల్లలను బడికి పంపిస్తున్న నా అక్కచెల్లెమ్మలందరినీ నిండుమనస్సుతో అభినందిస్తున్నాను. 1వతరగతి నుంచి 12వతరగతి వరకూ చదివిస్తున్న 42.62 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తద్వారా 83.15 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... రూ.6393 కోట్లు వాళ్ల బ్యాంకుల ఖాతాల్లో 10 రోజుల పండగ వాతావరణంలో జమ చేస్తారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్, ప్రైయివేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్ధుల అందరి తల్లులకు అమ్మఒడి వర్తింపచేస్తున్నాం. బటన్ నొక్కడం తెలియని బడుద్దాయిలకు చెప్పండి.. 4 ఏళ్లలో రూ. 26,067 కోట్లు.అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా 4 సంవత్సరాలలో రూ.26,067 కోట్లు జమ అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఎలాంటి లంచాలు లేకుండా, వివక్షకు చోటు లేకుండా నేరుగా రూ.26వేల కోట్ల రూపాయలు ఇచ్చాం. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయిలకు... బటన్ నొక్కడం అంటే ఇదీ అన్న విషయం అర్ధమయ్యేలా చెప్పండి. ఇది పిల్లలను చదివించుకునేందుకు, తమ పిల్లలను బడికి పంపించినందుకు, బడులలో 75 శాతం హాజరు ఉంటే చాలు ఆ తల్లులకు మనందరి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం. అది కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. 70 ఏళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతుంది. ఇక మీదట కూడా జరుగుతుంది. బంగారు భవిష్యత్తు కోసం బడికి పంపించండి... తల్లులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరినీ బడికి పంపించండి. ఈ రోజు మనం ఇస్తున్న అమ్మఒడి అనే కార్యక్రమం కాకుండా ఈ నాలుగేళ్లలో మీ పిల్లల బాగుకోరే ప్రభుత్వంగా విద్యారంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో నాలుగు మాటలు చెబుతాను. నాలుగేళ్లలో గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తునాయి. ప్రభుత్వ బడులన్నింటిలోనూ ఇంగ్లిషు మీడియం తీసుకొచ్చాం. బడులు ప్రారంభం మొదలు కాగానే.. మెరుగైన విద్యాకానుక కిట్లను ప్రతి పిల్లవాడు, పాప చేతిలో పెడుతున్నాం. గతంలో క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితి చూశాం. మన ప్రభుత్వంలో మూడోతరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ఉండేలా నాలుగేళ్లలో అడుగులు వేశాం. మన పిల్లలు ఇంగ్లిషు చక్కగా మాట్లాడాలి, అర్ధం చేసుకునే పరిస్థితి రావాలి, మన పిల్లలు విదేశాలకు వెళ్లాలన్న కూడా ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలని, మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కావాలని... మూడోతరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ టోఫెల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కరిక్యులమ్లోకి తీసుకొచ్చాం. అంతర్జాతీయ స్ధాయిలో.... గతంలో తెలుగుమీడియంలో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్లలో నేడు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలోకి కూడా పిల్లలకుపాఠాలు ఎలా చెప్పాలి ? పిల్లలు ఆ స్ధాయిలో ఎలా ఎదగాలి ? అని ఆలోచన చేస్తున్నది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే. పిల్లలకు బైలింగువల్ టెక్ట్స్బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లిషు పక్కపక్కనే ఇవ్వడమే కాకుండా, బైజూస్ కంటెంట్ను మన పాఠాల్లోకి అనుసంధానం చేసే కార్యక్రమం ఈ నాలుగేళ్లలోనే జరిగింది. డిజిటల్ క్లాస్ రూములు... 6వతరగతి నుంచి ప్రతి క్లాస్రూమ్ను డిజిటలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి క్లాస్రూమ్లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్ను తీసుకొచ్చి... వారికి సులభంగా చదువులు అర్ధమయ్యే విధంగా డిజిటల్ బోధనను మీ జగన్ మామయ్య ప్రభుత్వం స్కూళ్లలోకి తీసుకొచ్చింది . ఒకేరకమైన తిండి పిల్లలు తినలేరని, పౌష్టికాహారం ఉండాలని రోజుకొక మెనూతో పాటు చిక్కీ, రాగిజావ కూడా తీసుకొచ్చి గోరుముద్ద పేరుతో మంచి భోజనం ఉండాలని ఆలోచన చేసింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వమే. పిల్లలు ఎదగాలి. ఎదిగే పిల్లల మెదడు ఎదగాలంటే సరైన పోషణ ఉండాలి. సరైన తిండి ఉండాలని ఆలోచన చేసి అంగన్వాడీలలో సైతం మార్పులు తీసుకొచ్చాం. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ పోషణం అమలు చేస్తున్నాం. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే సంపూర్ణ పోషణం ప్లస్ కూడా అమలు చేస్తున్నాం. ఇది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అమలవుతుంది. నాడు –నేడు ప్రభుత్వ స్కూళ్లలో మార్పులు.. రాష్ట్రంలో ఉన్న 45వేల ప్రభుత్వ స్కూళ్లలో నాడు నేడు ద్వారా వాటి రూపురేఖలన్నీ సమూలంగా మార్చే కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే జరుగుతుంది. గవర్నమెంటు స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ 8వతరగతి పిల్లలకు వారితో పాటు టీచర్లకూ ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లో పనిచేసే విధంగా వారికి ట్యాబ్స్ అందిస్తున్నది కూడా మీ మేన మామ ప్రభుత్వమే. అది కూడా మీ మేనమామ పుట్టినరోజున మీతోపాటు ఆ ఆనందాన్ని పంచుకునేటట్టుగా ప్రవేశపెట్టాం. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేద పిల్లలు పెద్ద చదువుల కోసం అప్పలు పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఏ తల్లీతండ్రికి తమ పిల్లలను చదివించుకునేందుకు అప్పులు పాలయ్యే పరిస్థితి రావద్దనే.. వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో జగనన్న విద్యా దీవెన ఇస్తోంది మీ మేనమామ ప్రభుత్వం. చదువులు ఒక్కటే కాదు పిల్లల మెస్ ఖర్చులు, హాస్టల్ ఖర్చుల కోసం తల్లిదండ్రులు భరించలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ ఖర్చుల కూడా వారి నెత్తిన భారం కాకూడదని చెప్పి.. వారి కోసం వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే. పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. మన పిల్లలు సత్య నాదెళ్లతో పోటీ పడే విధంగా... ప్రతి కుటుంబం నుంచి సత్యనాదెళ్ల రావాలి. విదేశీచదువులు చదవాలంటే షాక్ కొట్టే మాదిరి ఫీజులుంటాయి, అవి చదవలేనిపరిస్థితి ఉండకూడదని.. 21 ఫ్యాకల్టీలలో ప్రపంచంలోనే టాప్ 50 లో ఉన్న .. టాప్ 350 కాలేజీలలో ఏ విద్యార్ధికి సీటు వచ్చిన రూ.1.25 కోట్ల వరకూ పూర్తి ఫీజును భరించడానికి ముందుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే. స్టాన్ఫోర్ట్, కార్నెగీ మెల్లన్ వంటి పెద్ద కాలేజీలు గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడ రూ.80–రు.90 లక్షల వరకు ఫీజులు ఉంటాయి. వాటిని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి... ఆ ఫీజులు రూ.1.25 కోట్లు అయినా ఫర్వాలేదు, మీకు సీటు వస్తే చాలు చదివించడానికి మీ మేనమామ ఉన్నాడని భరోసా ఇస్తున్నాం. జీవితంలో స్ధిరపడడానికి చదువు ఎంత అవసరమో అందరికీ గుర్తుండాలని చెప్పి, పదోతరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు–షాదీ తోఫా అమలు చేస్తుంది కూడా మీ మేనమామ ప్రభుత్వమే. రూ.66,722 కోట్లతో విద్యారంగంలో సంస్కరణలు. ఇలా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే అక్షరాలా రూ.66,722 కోట్లు ఖర్చు చేశాం. ఆ పేద పిల్లలు చదవాలి, ఎదగాలి ప్రపంచంతో పోటీపడాలి. ఆ పోటీ ప్రపంచంలో నెగ్గాలి. ఇదొక్కటే మీ దగ్గర నుంచి మీ మేనమామ కోరుకుంటుంది. మన కళ్లెదుటనే ఇన్ని మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తున్నా.. గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా? అని అడుగుతున్నాను. ఇక్కడే మరికొన్ని విషయాలు కూడా మీ అందరికీ చెప్పాలి. మనం చేసిన ఈ విప్లవాత్మక మార్పులు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయన్నది చూస్తే.. వీటిలో మన కళ్లెదుటనే మనకే కనిపించేది. పేద పిల్లలు పేదవర్గాలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో చెప్పే చదువులు వేరు. డబ్బులు కట్టి ప్రయివేటు బడులలో చెప్పించే చదువులు వేరు అని... రెండు రకాల చదువుల్ని... ఆ చదువుల్లోని అంటరానితనాన్ని తుదిముట్టించడం మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది. ఈ రోజు ఆ పెత్తందార్లకు అందుబాటులో ఉన్న ఆ చదువులకంటే గొప్ప చదువులు నా పేద పిల్లలకు ఇవాళ అందుబాటులోకి వచ్చాయి. రెండో మార్పు ఏమిటంటే... మామూలుగా గవర్నమెంట్ బడుల ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆ బడులలో క్వాలిపైడ్ టీచర్లు ఉన్నా కూడా అక్కడ విద్యావిధానం, కరిక్యులమ్, మీడియమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వసతులు వంటివన్నీ ఏమాత్రం బాగాలేవు అన్న పరిస్థితి ఇంతకముందు వినిపించేది. నాలుగేళ్ల మీ మేనమామ ప్రభుత్వంలో గవర్నెమెంటు బడులు .. ప్రైవేట్ బడులకు తీసిపోకుండా.. ప్రయివేటు బడులే ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. పెత్తందారీ విద్యావిధానాన్ని బద్దలుకొట్టి.. గిరిజన పిల్లలు, దళితుల పిల్లలు, బీసీ, మైనార్టీలు, పేదల పిల్లలు వీళ్లంతా ఎప్పటికీ చిన్న, చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతకాలి. గ్రామాల్లో వీళ్లంతా చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతకాలి. మరికొంత మంది కూలీలుగానూ, పనివారిగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ విద్యావిధానాన్ని బద్దలుకొట్టి... నా గిరిజన పిల్లలు, నా దళితులు, బీసీలు, మైనార్టీ పిల్లలు పేదరికంలో ఉన్న పిల్లలు కూడా పెద్దల మాదిరిగానే ఇంగ్లిషు మీడియం చదువులతోపాటు, వాళ్ల బడుల్లో కూడా టోఫెల్, డిజిటల్ విద్యను సైతం వారి చేతుల్లో పెడుతుండడం అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మార్పు. ఇది కూడా ఈ నాలుగేళ్ల పాలనలో పాలనలోనే కనిపిస్తుంది. ప్రభుత్వ బడుల్లలో ఆణిముత్యాలు, వజ్రాలు, రత్నాల కోసం.. నాలుగో మార్పు... గవర్నమెంట్ బడుల్లో ఆణిముత్యాలుంటాయని, వజ్రాలు, రత్నాలు ఉంటాయని.. ఈ వజ్రాలు, రత్నాలు, ఆణిముత్యాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకొచ్చింది మీ మేనమామ ప్రభుత్వంలోనే. కాబట్టే పేద కుటుంబాల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతోంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెపుతాను. వెలుగుతున్న ప్రభుత్వ బడులు... టెన్త్ పరీక్షల్లో గవర్నమెంట్ స్కూళ్లో నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది ఏకంగా 64కు పెరిగాయి. 75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 మంది అయితే, ఈ ఏడాది 67,114కు పెరిగింది. గవర్నమెంట్ స్కూళ్లలో గతేడాది 66.50 శాతం పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాసయితే ఈ ఏడాది 70.16 శాతానికి పెరిగారు. ఈ యేడాది జేఈఈ అడ్వాన్స్డు పరీక్షల్లలో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్ధులు అద్భుత ప్రతిభ చూపించారు. 67 మంది పిల్లలకు ఐఐటీ, ఎన్ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం కూడా ఈ సంవత్సరం రాబోతోంది. విద్యారంగంలో మనం చేస్తున్న మార్పులతో స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018–19లో అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరం గమనిస్తే.. స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో.. 84.48 శాతంతో మన రాష్ట్రంలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు 100.80 శాతంతో, జాతీయ సగటు 100.13 శాతం కంటే మెరుగ్గా ఉన్నాం. ఇది విద్యారంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కిన ఫలితం. ఇదే సందర్భంగా అమ్మఒడి కింద రూ.15వేలు అందుకుంటున్న తల్లులకు మీ అన్నగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో రూ.1000 మీ పిల్లల వెళ్లే స్కూలు మెయింటినెన్స్ కోసం, మరో రూ.1000 టాయిలెట్స్ మెయింటినెన్స్ కోసం కలిపి రూ.2వేలు కాంట్రిబ్యూట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ డబ్బులు కూడా మీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులలో పేరెంట్స్ కమిటీ సూపర్విజన్లో, హెడ్ మాష్టర్ పర్యవేక్షణలోనే ఖర్చు చేసి, స్కూళ్లు బాగా ఉండేటట్టు చేస్తారు. గిరిజనులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం... ఈ గిరిజన ప్రాంతానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మీ అందరితో పంచుకుంటాను. మొట్టమొదటిసారిగా గిరిజనులను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఐదుమంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో నా చెల్లెమ్మ పుష్పశ్రీవాణి మొట్టమొదట డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఘనత నా చెల్లెమ్మకే దక్కుతుంది. ఈ రోజుకి కూడా మీ జగనన్న కేబినెట్లో గిరిజనుడు ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. అధికారంలోకి రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైబల్ అడ్వైజర్ కమిటీని వేసిన చరిత్ర కూడా మనదే. నవరత్నాలను ప్రతి గిరిజనుడికీ చేర్చాలని... నవరత్నాల్లోని ప్రతి పథకమూ మారుమూలలో ఉన్న ట్రైబల్ గ్రామాలకి చేర్చాలని తపన, తాపత్రయం పడుతున్న ప్రభుత్వం మనదే. ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 118 టవర్లను ఒక్కో టవర్ ఖర్చు 80 లక్షలతో 2,600 సెల్ ఫోన్ టవర్లు నిర్మాణంలో కనిపిస్తున్నాయి. చివరి ఊరు వరకూ ప్రభుత్వ పథకాలు అత్యంత పారదర్శకంగా అందాలని, ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న తాపత్రయంలో అడుగులు పడుతున్నాయి. ఈ రోజు ఇదే గిరిజన ప్రాంతంలో ఆసుపత్రులకు దిక్కులేని పరిస్థితులు ఉంటే.. ఐదు ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా కడుతున్నాం. మరోవైపున ఇదే కురుపాం నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజీ రాబోతోంది. ఉత్తరాంధ్రాకు 4 కొత్త మెడికల్ కాలేజీలు.. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ ప్రాంతంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఒకటి పాడేరులో వేగంగా కడుతున్నారు. మరొకటి కురుపాంలో రాబోతోంది. మూడోది నర్సీపట్నంలో వేగంగా కడుతున్నారు. నాలుగోది విజయనగరంలో రేపు సంవత్సరం అడ్మిషన్లు రాబోతున్నాయి. వచ్చే నెల ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నాం. ఇదే గిరిజనుల కోసం ఏకంగా 1,47,242 కుటుంబాలకు మేలు చేస్తూ ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలు 3,62,737 ఎకరాలను పంచి పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఒక్క కురుపాంలోనే 21,311 కుటుంబాలకు 38,798 ఎకరాలు పంపిణీ చేశాం. అంతే కాకుండా వాళ్లందరికీ రైతు భరోసా సొమ్మును కూడా గత నాలుగేళ్లుగా ఇస్తున్న ప్రభుత్వం మనది. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం... ఏ నామినేటెడ్ పదవి, ఏ నామినేటెడ్ కాంట్రాక్ట్ అయినా నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించాలని చట్టం చేశాం. ఈ రోజు మన కళ్లెదుటనే గ్రామ సచివాలయాల్లో 1,30,000 మంది ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్టీ, ఎస్సీలు, నా బీసీలు, మైనార్టీలు 84 శాతం ఉద్యోగాల్లో కనిపిస్తున్నారు. మంచిని జీర్ణించుకోలేక... ఇంత మంచి చేస్తున్నా మనందరి ప్రభుత్వాన్ని... జీర్ణించుకోలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. మనందరి ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేక... 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏమీ చేయని ఓ నాయకుడు.. ఆ నాయకుడి కోసం 15 సంవత్సరాల పుట్టిన ఓ దత్తపుత్రుడు. వీళ్లు టీడీపీ.. అంటే టీ–తినుకో, డీ–దోచుకో, పీ–పంచుకో.. పార్టీతో కలిసి, దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ బొజ్జలు పెంచుకుంటూ బొజ్జ రాక్షసుల పత్రికలు, వారి టీవీలు ఇవన్నీ మనల్ని విమర్శిస్తున్నాయి. ఆలోచన చేయండి. వాళ్లందరికీ కూడా కడుపులో మంట. ఈర్ష్యతో కళ్లు కప్పుకుపోయాయి. దుష్టచతుష్టయం– నాలుగు కోతులు. గాంధీగారి మూడు కోతులు.. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని నీతులు చెబుతాయి. ఇవి చెప్పే నీతి చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని. కానీ, మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు.. మంచి చేయవద్దు అనే నాలుగు కోతులున్నాయి. వీరినే దుష్ట చతుష్టయం అని మనమంతా పిలుచుకుంటున్నాం. ఇదే వీరి దుర్నీతి. మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దు ఇది వీరి దుర్నీతి. వీరికి అధికారం ఎందుకు అంటే... ఆ అధికారంతో అవినీతి సొమ్మును పంచుకోవడం.. ఇదీ వారి రాజనీతి. నమ్మించి ప్రజల్ని నట్టేట ముంచడమే వారికి తెలిసిన ఏకైక నీతి. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏ మంచీ చేయని ఈ బాబు.. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని ఈబాబు.. ఏ సామాజిక వర్గానికీ కూడా ఏ మంచీ చేయని బాబు. పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, రైతులకు ఫలానా ఈ మంచి చేసామని చెప్పుకునేదానికి ఏ మాత్రం మంచి చేసిన చరిత్రే లేని ఈ బాబు.. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెస్తారు. అధికారంలోకి వస్తే.. అన్నీ చేస్తామంటారు. ఎన్నికల తర్వాత పొరపాటున అధికారంలోకి వస్తే.. వచ్చిన వెంటనే ఆ ఎన్నికల ప్రణాళిక, ఆ మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్ రికార్డు. మరోసారి ఇదే దుష్ట చతుష్టయం, ఇదే బాబు.. మరోసారి అధికారం ఇవ్వండంటూ మరోసారి మేనిఫెస్టోతో మళ్లీ మోసానికి దిగారు. డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు. ఈసారి డ్రామాలకు కొంచం రక్తి కట్టించారు.ఈ సారి ఎన్నికల ప్రణాళిక అంటూ తీసుకొచ్చిన మోసాల జాబితాలో.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారంట... మోసం చేసేదానికి కూడా ఒక హద్దులు పద్దులు పోయి.. జగన్ ఏం చేస్తున్నాడు ? .. జగన్ కంటే కాస్త ఎక్కువ చెప్పాలని మోసం చేయడంలో రక్తి కట్టించడం మొదలుపెట్టాడు. వీళ్లందరికీ తోడు ఒక దత్త పుత్రుడు ఉన్నాడు. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు, ఇదే మాదిరిగా చంద్రబాబుకు మద్దతు పలికాడు. మీ ఇంటికి లేఖలొచ్చాయి. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు దత్తపుత్రుడి సంతకంతో లేఖలు వచ్చాయి. మాదీ బాధ్యత.. ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్త బుట్టలో వేశారు. చంద్రబాబునాయుడు ప్రజలను, రైతులను, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్న పిల్లలను సైతం వదలకుండా చంద్రబాబు మోసం చేశాడు. గతంలో 5 ఏళ్లు నోరెత్తని దత్తపుత్రుడు... కానీ పూచీగా సంతకం పెట్టిన దత్తపుత్రుడు 5 సంవత్సరాల్లో ఒక్క మాటా మాట్లాడలేదు. అలాంటి ఈ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్..ఈ రోజు ఓ లారీ ఎక్కాడు. దాని పేరు వారాహి అట. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ.. మామూలుగా మాట్లాడడు. ఊగిపోతూ... తనకు నచ్చని వారిని చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలూడదీసి తంతానంటాడు. ఈ మనిషి నోటికి అదుపులేదు. నిలకడ లేదు. వారిలా పూనకం వచ్చినట్లు మనం ఊగుతూ మాట్లాడలేం. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా బూతులు తిట్టలేం. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. మన పునాదులు పేదల పట్ల ప్రేమలోంచి పుట్టాయి. రైతుల నుంచి వారి మమకారంలోంచి పుట్టాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలోంచి మన పునాదులు పుట్టాయి. వారికి మాట ఇచ్చి మోసం చేయడం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. మన పునాదులు అక్కచెల్లెమ్మల భవిత కోసం... మన పునాదులు నా అక్కచెల్లెమ్మల భవిత కోసం, వారి కుటుంబాల భవిత కోసం అక్షరాలా రూ.2.23 లక్షల కోట్లు నాలుగేళ్లలో నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి బటన్ నొక్కే డీబీటీ పునాదుల మీద పుట్టాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. వారిలా అధికారం అంటే కేవలం దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. వాళ్ల పునాదులు, మన పునాదుల మధ్య తేడా గమనించాలి. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, గ్రోత్ రేటు అప్పటికన్నా ఇప్పుడే రేటు తక్కువ. మారిందల్లా కేవలం ఒక్క జగన్. వాళ్లెందుకు చేయలేకపోయారు. మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. ఆలోచన చేయండి. మన పునాదులు సామాజిక న్యాయంలో ఉన్నాయి,తప్ప వారిలా సమాజాన్ని చీల్చడంలో లేవు. వాళ్ల సోషల్ మీడియా, పత్రికలు, టీవీలు, వాళ్లంతా కలిసికట్టుగా రోజూ అదే అబద్దాలు.. వాళ్లు చేస్తున్న దుర్నీతిని గమనించాలి. సమాజాన్ని చీలుస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంతింత పెద్దగా చూపిస్తున్నారు. దానికి ఆ తప్పు మనదే అన్నట్టుగా ఆ తప్పును మన మీద వేస్తూ బురద జల్లుతున్నారు. మీ బిడ్డ ప్రభుత్వంలో 5 మంది డిప్యూటీ సీఎంలలో నలుగురు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలే. ఈ రోజు రాష్ట్రానికి హోం మంత్రిగా నా దళిత చెల్లెమ్మ ఉంది. అలాంటి మనందరి ప్రభుత్వం మీద కావాలని పనిగట్టుకొని సమాజాన్ని చీల్చడం కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూడాలి. మన పునాదులు పేదల జీవితాలను మార్చేలా వారి కోసం తీసుకొస్తున్న విద్యా విప్లవంలో మన పునాదులున్నాయి. పేదల జీవితాలు మార్చేలా వాళ్ల కోసం ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో ఉన్నాయి. వారి కోసం కట్టిస్తున్న ఇళ్లలో మన పునాదులున్నాయి. గ్రామాల్లో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండాఆత్మగౌరవంతో అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతలు, పిల్లలకు మంచి జరిగేలా అందిస్తున్న పౌర సేవల్లో నా పునాదులున్నాయి. మన పునాదులు డీసెంట్రలైజేషన్లో ఉన్నాయి. గ్రామ స్ధాయి నుంచి రాజధాని వరకు ప్రతి అడుగులోనూ డీసెంట్రలైజ్ చేసిన గవర్నెన్స్లో ఉన్నాయి. సామాజిక న్యాయంలో ఉన్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాల్లో మన పునాదులున్నాయి. మన పునాదులు పనికిమాలిన పంచ్ డైలాగుల్లో లేవు వాళ్ల మాదిరిగా. మన పునాదులు మన ఓదార్పు యాత్ర నుంచి, 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో, పేదల కష్టాల్లోంచి నా పునాదులు పుట్టాయి. వారి మాదిరిగా వెన్నుపోటులోంచి నా పునాదులు పుట్టలేదు. అబద్ధాలపైన మన పునాదులు లేవు. వారి మాదిరిగా దోచుకో, పంచుకో, తినుకో అనే సిద్దాంతం నుంచి మన పునాదులు పుట్టలేదు. మా నాయకుడు అని కాలర్ ఎగరేసేలా... ఇలాంటి పటిష్టమైన, బలమైన, విస్తృతమైన పునాదుల మీద నిలబడ్డాం కాబట్టే, పేదవాడి కోసం నిలబడ్డాం కాబట్టి ఈ రోజు 2009 నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి జగన్ అనే మీ అన్నను ఒక్కసారి గమనిస్తే... ఎక్కడా కూడా ఏ కార్యకర్తా కూడా జగన్ ను చూసినప్పుడు, జగన్ నడిచే నడక చూసినప్పుడు అడుగో అతడే మా నాయకుడని కాలర్ ఎగరేసేలా నడత, ప్రవర్తన ఉంది. ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ. ఏ రోజూ అధర్మాన్ని ఆశ్రయించలేదు. ఏ రోజూ అనైతికమైన పనులు చేయలేదు. ఏ రోజూ అబద్దాలు చెప్పి గెలవాలని ప్రయత్నం చేయలేదు. అధికారం కోసం, పొత్తుల కోసం పాకులాడలేదు. ప్రతి అడుగులోనూ పేద వాడు బాగుండాలని ఆలోచన చేశాను. ఇదీ మన పునాది. ఇదీ మన ఫిలాసఫీ, ఇదీ మన పార్టీ. ఇదీ మన మనసున్న ప్రభుత్వమని తెలియజేస్తున్నా. చేసిన మంచే మన బలం– మన నినాదం... ఈరోజు చేసిన మంచే మన బలం, ఇదే మన నినాదం. ఈరోజు మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. అధర్మాన్నే ధర్మంగా వాళ్లు ఎంచుకొని వాళ్లు యుద్ధం చేస్తున్నారు. వాళ్ల మాదిరిగా మీ బిడ్డకు డంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. వీళ్ల మాదిరిగా ఓ దత్తపుత్రుడు తోడుగా లేడు. ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పిందే చెప్పి.. అదే నిజమని భ్రమ కలిగించే మీడియా మాధ్యమాలు మీ బిడ్డకు లేవు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడ్ని, మిమ్మల్నే... నేను చెప్పేది ఒక్కటే. మీ బిడ్డ ఇలాంటి తోడేళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్నే. నేను కోరేది ఒక్కటే. వీళ్లు చెబుతున్న అబద్ధాలు నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికులుగా నిలబడండి. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డకు శ్రీరామ రక్షగా నిలవాలని కోరుతున్నా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరగబోతున్న వేడుకలో ప్రజా ప్రతినిధులంతా పాల్గొనాలని ఆదేశిస్తున్నాను. ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుతున్నాను. కాసేపటి క్రితం.. నా చెల్లి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ .. కురుపాం మండలంలో సింగుపురంలో మినీ రిజర్వాయరు కోసం అడిగింది. రూ.38 కోట్లు ఖర్చయ్యే దీన్ని మంజూరు చేస్తున్నాం. ఒక బ్రిడ్జి నిర్మాణం, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, జీడిపప్పు ప్రాసెసింగ్ ప్లాంటు అడిగింది. ఇవి కూడా మంజూరు చేస్తున్నాను. వీటన్నింటి ద్వారా మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.