కోవిడ్‌ కట్టడికి వ్యాక్సినేషన్‌ ఏకైక పరిష్కారం 

ప్రైౖవేటు ఆస్పత్రుల్లో మిగిలిపోయిన టీకాల స్టాకును తిరిగి రాష్ట్రానికి ఇవ్వండి 

కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు

ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశాం

ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి: కరోనా నివారణకు వ్యాక్సినేషన్‌ సరైన పరిష్కారమని, ప్రైౖవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాల్గొని మాట్లాడారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామన్నారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవని ప్రధానికి వివరించారు. అయినా సరే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచామని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశామని, లక్షణాలున్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేసి, వైద్య సేవలు అందించామన్నారు. దీనివల్ల కోవిడ్‌ విస్తరణను అడ్డుకోగలిగామన్నారు. 

వ్యాక్సినేషన్‌ అనేది కోవిడ్‌కు సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీకి కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయని, వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చామని వివరించారు. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాల వల్ల ఇచ్చినదానికన్నా ఎక్కువ మందికి వేయగలిగామన్నారు. జూలై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని, ప్రైౖ వేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని చెప్పారు. 

క్షేత్రస్థాయిలో చూస్తే ప్రైవేట్‌ ఆస్పత్రులకుS కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారన్నారు. జూన్‌ నెలలో ప్రైౖ వేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేనన్నారు. ప్రైౖ వేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని ప్రధానిని కోరారు. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుందన్నారు. కోవిడ్‌ నివారణలో కేంద్రప్రభుత్వ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 

ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనిజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top