గుంటూరు : బీసీల అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. నగర శివారు అమరావతిరోడ్డులో బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న నేత సీఎం వైయస్ జగన్ అని కొనియాడారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని, కానీ నేడు జగనన్న ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి జరిగిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు, చట్ట సభల్లో ప్రాధాన్యం దక్కిందన్నారు. బీపీ మండల్ బీసీల అభివృద్ధికి దేశ వ్యాప్తంగా తిరిగి జనాభా ప్రాతిపదికన ఎన్నో సంస్కరణలు చేశారని, వాటిని అమలు చేయాలని కోరారు. బీసీల అభివృద్ధికి జనగణన చేపట్టాలంటూ బీసీలంతా ఐకమత్యంగా ఒక వేదికపైకి రావడాన్ని అభినందించారు. జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, కల్పలతారెడ్డి, ఎంపీ బీద మస్తాన్రావు, నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, బీపీ మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్మండల్, ద్రవిడ కజగం ప్రెసిడెంట్ వీరమణి, తమిళనాడు ఎంపీ తిరుమావళాన్, బీసీ సంక్షేమ సంఘం నేత డాక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.