సచివాలయం: రైతులకు అందించే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని, ప్రస్తుత సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఉచిత విద్యుత్ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమన్నారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిచి.. ఆ బ్యాంకు ఖాతాలో నేరుగా కరెంటు బిల్లు డబ్బు జమ చేయనున్నామన్నారు. అదే డబ్బును రైతు డిస్కంలకు చెల్లిస్తారన్నారు. నూతన సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం లేదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ అమలవుతుందని, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 10 వేల మెగావాట్ల సోలార్తో పథకాన్ని మరింతగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. వచ్చే 30 –35 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకాలేకుండా చేస్తామన్నారు. పగటిపూట 9 గంటల కరెంట్ ఇప్పటికే 89 శాతం ఫీడర్లలో అమలు చేస్తున్నట్లు వివరించారు. రబీ సీజన్ నుంచి పూర్తిగా అమలు చేస్తామన్నారు. ఉచిత విద్యుత్పై పేటెంట్ ఒక్క వైయస్ఆర్కేనని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. నాడు వైయస్ఆర్ ఉచిత విద్యుత్ ప్రకటిస్తే.. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. చివరకు బషీర్బాగ్లో కాల్పులకు దిగిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు రూ.8 వేల కోట్ల బకాయిలు ఉంచితే.. మన ప్రభుత్వం తీర్చిందన్నారు.