తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని విన్ ఓవెన్ సీఎం వైయస్ జగన్కు తెలిపారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై క్షణ్ణంగా చర్చించిన అంశాలను ముఖ్యమంత్రితో విన్ ఓవెన్ చర్చించారు. యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అమలుచేయాలన్న ప్రణాళిక చాలా బావుందని ప్రశంసించారు. అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటీష్ బృందానికి సీఎం వైయస్ జగన్ వివరించారు. యూకే – భారత్ విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్ధులకు బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇందుకు విన్ ఓవెన్ సానుకూలంగా స్పందించారు. ఐటీ, పరిశోధన రంగాలపై ఆసక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్ళేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం వైయస్ జగన్కు బ్రిటీష్ బృందం హామీ ఇచ్చింది. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటీష్ బృందానికి వివరించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో అభివృద్ది చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారు.
వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ విన్ ఓవెన్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. విద్యారంగానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రికి ఓవెన్ బృందం వివరించింది. ఈ సమావేశంలో బ్రిటీష్ కమిషన్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి పాల్గొన్నారు.